Thursday, May 2, 2024

వర్షాలను కూడా రాజకీయం చేయవద్దు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

చేతనైతే సహాయక చర్యల్లో పాల్గొనాలి
ప్రభుత్వ ఉద్యోగుల మనోధైర్యం దెబ్బతీసే విధంగా
ప్రతిపక్షాలు చిల్లర విమర్శలు మానుకోవాలి
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్:  వర్షాలను కూడా రాజకీయం చేయవద్దని, చేతనైతే సహాయక చర్యల్లో పాల్గొనాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ప్రతిపక్ష నాయకులకు సూచించారు. భారీ వర్షాల్లో నిరంతరం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల మనోధైర్యం దెబ్బతీసే విధంగా చిల్లర విమర్శలు చేయవద్దన్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు వర్షాన్ని ఎదుర్కొనేందుకు పనిచేస్తున్నాయని, వారి మనోధైర్యం దెబ్బతినకుండా నాయకులు మాట్లాడితే బాగుంటుందని మంత్రి కెటిఆర్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పట్టణాల్లో ఉన్న పరిస్థితులపై పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ గురువారం సమీక్ష నిర్వహించారు.

ఈ సమీక్షలో హైదరాబాద్ నుంచి పురపాలక శాఖ అధికారులు, అడిషనల్ కలెక్టర్లతో మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మంత్రి కెటిఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్‌లో వారం రోజులుగా ఎడతెరపిలేకుండా వానలు కురుస్తున్నాయని, దీంతో హుస్సేన్ సాగర్‌కు భారీగా వరద వచ్చి చేరుతుందని మంత్రి కెటిఆర్ అన్నారు. ఈ క్రమంలోనే హుస్సేన్‌సాగర్ వద్ద వరద ఉధృతిని కెటిఆర్ పరిశీలించారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని కెటిఆర్ తెలిపారు. అలాగే నగరంలో ఎక్కడ కూడా ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.

ప్రాణనష్టం జరగకుండా చూడడమే ప్రాథమిక ప్రాధాన్యతగా పనిచేయాలని ఆయన అధికారులకు సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని, వరదనీరు నిలిచిన పట్టణాల్లో మరిన్ని సహాయక చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. శిథిలావస్థలో ఉన్న భవనాల నుంచి ప్రజలను వెంటనే తరలించాలని ఆయన ఆదేశించారు.

వర్షకాలం ప్రారంభానికి ముందే నాలాల్లో పూడిక తీశాం

వర్షకాలం ప్రారంభానికి ముందే నాలాల్లో పూడిక తీశామని కెటిఆర్ చెప్పారు. చెరువుల్లోనూ తక్కువ నీటిమట్టం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన వెల్లడించారు. నగరంలో ఎస్‌ఆర్‌డిపి చేపట్టకముందు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యేవన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. హైదరాబాద్‌లో 14 బ్రిడ్జిలు మంజూరు చేశామన్నారు.

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారన్నారు. పురపాలక శాఖ అధికారులతోనూ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మాట్లాడారని ఆయన తెలిపారు. నగరంలో జిహెచ్‌ఎంసి కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో ఉన్న కిందిస్థాయి సిబ్బంది వరకు అందరూ పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

135 చెరువులకు గేట్లు బిగించాం

పురపాలక ఉద్యోగుల సెలవులను రద్దు చేశామని మంత్రి కెటిఆర్ తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు ఫోన్ల ద్వారా ఇతర మాధ్యమాల ద్వారా సమీక్షిస్తున్నామని కెటిఆర్ పేర్కొన్నారు. కుంభవృష్టిగా వర్షం పడడం ఎడతెరిపి లేకుండా వర్షం కురవడం వల్ల ప్రజలకు కొంత ఇబ్బంది ఎదురవుతుందన్నారు. కానీ, ఇప్పటిదాకా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన తెలిపారు. తమ ప్రధాన లక్ష్యం ప్రాణ నష్టం జరగకుండా చూడడమేనని ఆయన పేర్కొన్నారు. రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అన్నిరకాల చర్యలు చేపట్టిందన్నారు. హైదరాబాద్‌లో పురాతన భవనాల కూల్చివేత కార్యక్రమాన్ని ఎప్పుడో పూర్తి చేస్తామన్నారు. దీంతోపాటు చెరువుల బలోపేతం చేసే కార్యక్రమాన్ని చేపట్టామని, 135 చెరువులకు గేట్లు బిగించామని, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు అధికారులు సిబ్బంది కూడా విస్తృతంగా పనిచేస్తున్నారన్నారు.

తాత్కాలిక షెల్టర్ల ఏర్పాటు

గతంలో ఇలాంటి భారీ వర్షాలు పడితే అనేక ప్రాంతాలు జలమయం అయ్యేవని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. అయితే ఈసారి కూడా నాలా డెవలప్‌మెంట్ ప్రోగ్రాం ద్వారా చేపట్టిన కార్యక్రమాల వలన వరద ప్రభావం కొంత తగ్గిందని కెటిఆర్ తెలిపారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఆయా ప్రాంతాల్లో వరద సమస్య బాగా తగ్గిందన్నారు. ప్రభుత్వం, యంత్రాంగం, సిబ్బంది 24 గంటలు ఈ భారీ వర్షాలను ఎదుర్కొనేందుకు పనిచేస్తుందన్నారు. వరద పెరిగే ప్రాంతాల్లో ఉన్న పౌరులను అలర్ట్ చేస్తున్నామని, ఎక్కడికక్కడ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేస్తూ తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు. చెరువులకు గండిపడే ప్రమాదం ఉంటే వాటిని కూడా సమీక్షిస్తున్నామన్నారు. మూసీ వరదను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటామని, వరంగల్ నగరానికి వెళ్లాలని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించామని, అవసరమైతే తాను కూడా స్వయంగా వెళ్తానని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News