Friday, April 26, 2024

నినాదాన్ని నిజం చేద్దాం

- Advertisement -
- Advertisement -

‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదాన్ని నిజం చేసే వరకు విశ్రమిద్దాం
ఉద్యమ నాయకుడే ఉత్తమ పాలకుడని యావత్ దేశం కొనియాడుతోంది
బిఆర్‌ఎస్ పార్టీ జాతీయ ప్రస్థానం నేడు ఒక చారిత్రక అవసరం
ఉద్యమపాఠాల నుంచి మొదలుకొని యావత్ దేశానికి
ఉజ్వలమైన పరిపాలనా పాఠాలు నేర్పిన ఘనత సిఎం కెసిఆర్‌దే
ఢిల్లీ బిఆర్‌ఎస్ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్:‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదాన్ని నిజం చేసే వరకు విశ్రమించకుండా పనిచేద్దామని బిఅర్‌ఎస్ పార్టీ శ్రేణులకు కెటిఆర్ పిలుపునిచ్చారు. ఢిల్లీ బిఆర్‌ఎస్ భవన్‌లో మంత్రి కెటిఆర్ సందడి చేశారు. ఢిల్లీ బిఆర్‌ఎస్ భవన్‌కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ గురువారం మధ్యాహ్నం చేరుకున్నారు. ఈ సందర్భంగా కెటిఆర్‌కు పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఇక భవనంలోని ఓ అంతస్తులో అమ్మవారి విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం కెటిఆర్ మాట్లాడుతూ జలదృశ్యంలో ఒక్కరితో మొదలైన ప్రయాణం.. మహాప్రస్థానమై.. దేశ రాజధానిలో సగర్వంగా అడుగుపెట్టిన సందర్భంగా గులాబీ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఢిల్లీలో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం, కేవలం బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులకే కాదనీ, యావత్ తెలంగాణ ప్రజలకు గర్వకారణ మన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో పార్టీ కార్యశ్రేణుల పట్టుదల వల్లే తెలంగాణ ఆత్మగౌరవ పతాకైన బిఆర్‌ఎస్ జెండా ఇవాళ సమున్నతంగా ఢిల్లీలో రెపరెపలాడిందని కెటిఆర్ గుర్తుచేశారు. ఉద్యమ నాయకుడే ఉత్తమ పాలకుడని యావత్ దేశం కొనియాడుతున్న వేళ బిఆర్‌ఎస్ పార్టీ జాతీయ ప్రస్థానం నేడు ఒక చారిత్రక అవసరమన్నారు.

గోల్‌మాల్ గుజరాత్ మోడల్ పనికిరాదు
నాడు ఉద్యమ పార్టీగా పురుడుపోసుకొని ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన గులాబీ జెండా ఇప్పుడు దశాబ్దాల పాటు దగాపడ్డ దేశ ప్రజలను గెలిపించడానికే హస్తినలో అడుగుపెట్టిందన్నారు. ఉద్యమపాఠాల నుంచి మొదలుకొని యావత్ దేశానికి ఉజ్వలమైన పరిపాలనా పాఠాలు నేర్పిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కిందని కెటిఆర్ వెల్లడించారు. ఈ మహాప్రస్థానంలో బిఆర్‌ఎస్ వేసిన ప్రతి అడుగు సంచలనమని అధికార పార్టీగా తీసుకున్న ప్రతి నిర్ణయం ఓ సువర్ణ అధ్యాయమని కెటిఆర్ గుర్తుచేశారు. గోల్ మాల్ గుజరాత్ మోడల్ పనికిరాదని దేశప్రజలు గ్రహించిన నేపథ్యంలో గోల్డెన్ తెలంగాణ మోడల్ పైనే ప్రస్తుతం చర్చ జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలోనే జాతీయ రాజకీయంపై బిఆర్‌ఎస్ బలమైన ముద్ర వేయడం ఖాయమని కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు.

బిఆర్‌ఎస్‌ను అజేయశక్తిగా తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్న ప్రతి ఒక్క గులాబీ సైనికుడి బాధ్యత ఇప్పుడు మరింత పెరిగిందన్నారు. రానున్న రోజుల్లో మరింత సమరోత్సాహంతో కదంతొక్కాలని కెటిఆర్ పిలుపునిచ్చారు. బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ఇచ్చిన ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదం ఇప్పటికే దేశవ్యాప్తంగా మారుమ్రోగుతోందన్నారు. నాడు తెలంగాణ సాధన కోసం ఏ సంకల్పంతో బయలుదేరామో అదే స్ఫూర్తితో దేశం కోసం కదంతొక్కాలని ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదాన్ని నిజం చేసే వరకు విశ్రమించకుండా పనిచేద్దామని ఈ సందర్భంగా బిఅర్‌ఎస్ పార్టీ శ్రేణులకు కెటిఆర్ పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి కెటిఆర్ ఫోటోలు దిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News