Tuesday, April 30, 2024

కుమ్మక్కు రాజకీయాలు.. ముమ్మాటికీ మీవే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి, టిఆర్‌ఎస్ కుమ్మక్కు అయ్యాయని వస్తున్న ఆరోపణలపై ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ఢిల్లీలో తీవ్రంగా స్పందించారు. కమ్మక్కు రాజకీయాల గురించి చెప్పాల్సి వస్తే కాంగ్రెస్, బిజెపి పార్టీలు కుమ్మక్కైన ఉదంతాలు దేశంలోనూ, రాష్ట్రంలోనూ అనేకం ఉన్నాయని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో స్కైవేలు, స్కై వాక్స్ కోసం రక్షణ శాఖ భూములు కేటాయించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరినట్లు రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కెటిఆర్ కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన అనంతరం మీడియాతో కెటిఆర్ మాట్లాడుతూ మేఘాలయలో కాంగ్రెస్, బిజెపిలు పొత్తు పెట్టుకుంది నిజం కాదా అని మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు.

నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్, బిజెపి పార్టీలు కుమ్మక్కైన విషయం అందరికీ తెలుసనీ కెటిఆర్ ఆరోపించారు. ఇక్కడ కుమ్మక్కు కాకుంటే కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా ఎందుకు రాలేదని, జీవన్‌రెడ్డి లాంటి నాయకుడు అభ్యర్థిగా ఉన్న డిపాజిట్లు ఎందుకు కోల్పోయారని, ఎవరు ఎవరితో కుమక్కు అవుతున్నారో ప్రజలు గ్రహిస్తున్నారని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఢిల్లీలో తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌పై పార్లమెంట్‌లో వ్యతిరేకంగా నిలబడతామన్నారు. సమైక్య స్ఫూర్తికి వ్యతిరేకమైన ఈ ఆర్డినెన్స్‌కు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సపోర్ట్ చేస్తుందో వాళ్లే చెప్పాలన్నారు.
ప్రతిపక్ష పార్టీలు కలవడం కన్నా….
ప్రతిపక్ష పార్టీలు కలవడం కన్నా దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రజలు ఏకం కావడం ముఖ్యమని మంత్రి కెటిఆర్ అన్నారు. పాట్నాలో జరుగుతున్న ప్రతిపక్ష పార్టీల భేటీతో లాభం లేదన్నారు. కాంగ్రెస్, బిజెపిల వల్లే దేశంలో సమస్యలు ఉత్పన్నం అయినట్లు ఆయన విమర్శించారు. రాజకీయ పార్టీలు ఒక్కటి కావడం ముఖ్యం కాదని, దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రజలంతా ఏకం కావడం ముఖ్యమని కెటిఆర్ అన్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్న సమస్యలకు కాంగ్రెస్, బిజెపి పార్టీలే కారణమని ఆయన విమర్శించారు. ఆ రెండు పార్టీల వల్లే దేశంలో సమస్యలు ఉత్పన్నమైనట్లు ఆయన చెప్పారు. ఒకవేళ విపక్ష పార్టీలన్నీ రాజకీయంగా బిజెపి వైపో లేక కాంగ్రెస్ వైపో మళ్లీతే అప్పుడు దేశానికి ఎటువంటి ప్రయోజనం ఉండదని ఆయన అన్నారు.
దేశ అభివృద్ధిలో ఈ రెండు పార్టీలు విఫలం
ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా ప్రజల్లో ఐకమత్యం రావాల్సిన అవసరం ఉందన్నారు. అంశాల వారీగా ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసే ప్రయత్నాన్ని కొనసాగించాలన్నారు. రేపు ప్రజలు ఏకం చేసే అంశాన్ని నమ్ముతాం, కానీ, రాజకీయ పార్టీలు ఏకం చేసే అంశాన్ని కాదని కెటిఆర్ తెలిపారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో దేశాన్ని అభివృద్ధి చేయడంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఘోరంగా విఫలం అయ్యాయన్నారు. ఇప్పటికీ విద్యుత్, నీటి సరఫలేని గ్రామాలు దేశంలో ఉన్నాయంటే వీటి బాధ్యత పూర్తిగా ఈ రెండు జాతీయ పార్టీలదేనని ఆయన ఆరోపించారు.
బలహీనమైన ప్రధానమంత్రి మోడీ
దేశంలో ఇప్పటిదాకా పనిచేసిన ప్రధాన మంత్రుల్లోకెల్లా అత్యంత బలహీనమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని కెటిఆర్ ఆరోపించారు. నరేంద్ర మోడీ బలహీనతలను దేశంలో అందరికంటే ఎక్కువగా విమర్శించింది బిఆర్‌ఎస్ పార్టీనేనని ఆయన తెలిపారు. ప్రజల సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రధాన మంత్రి మోడీకి అవకాశం ఇస్తే ఢిల్లీని కూడా తీసుకెళ్లి గుజరాత్‌లో పెడతాడని కెటిఆర్ ఎద్దేవా చేశారు.
కిషన్‌రెడ్డిది అమాయకత్వమో, అజ్ఞానమో….
కిషన్‌రెడ్డిది అమాయకత్వమో, అజ్ఞానమో తెలియదని కెటిఆర్ పేర్కొన్నారు. కిషన్ రెడ్డి ఇచ్చిన ప్రజేంటేషన్‌లో ప్రజలకు ఇచ్చిన అప్పును కూడా కేంద్రం ఇచ్చిన నిధులుగా చూపించిందని కెటిఆర్ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో సుమారు 10 చిన్న పట్టణాలకు మెట్రోలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, హైదరాబాద్‌లోని మెట్రోకు ఎందుకు సహకరించడం లేదో తెలపాలన్నారు. హైదరాబాద్‌లో వరదలు వస్తే సహకరించని కేంద్రం, గుజరాత్ లేదా ఇతర బిజెపి రాష్ట్రాల్లో వరదలు వస్తే ఎందుకు నిధు లిచ్చిందో కిషన్‌రెడ్డి చెప్పాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.

నిస్సహాయంగా ఉన్న కిషన్‌రెడ్డి కంటే పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తాము ఇవ్వగలమని కెటిఆర్ తెలిపారు. బిజెపి పాలిత రాష్ట్రాల అభివృద్ధిలోనూ తెలంగాణ రాష్ట్ర నిధులు ఉన్నాయని కెటిఆర్ తెలిపారు. ఈ విధంగా జాతి నిర్మాణంలో తెలంగాణ సహాయకారిగా ఉన్నందుకు బిజెపి నేతలు తెలంగాణ ప్రజలకు, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రం సాధించిన ప్రగతిని తెలంగాణ అభివృద్ధిని, నమూనాను దేశవ్యాప్తంగా అమలు చేయాలనుకుంటున్నామని కెటిఆర్ తెలిపారు.
ఘనంగా దశాబ్ధి ఉత్సవాలు
రాష్ట్ర అభివృద్ధిని ప్రపంచానికి చాటేలా తెలంగాణ దశాబ్ధి ఆవిర్భావ ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నా మన్నారు. అమరులకు అభివృద్ధి అసలైన నివాళి మాత్రమే అనే తీరుగా తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. తెలంగాణ దశాబ్ధి ఆవిర్భావ ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఐటి, ఏరో స్పేస్, డిఫెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ ఇలా అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతితో ముందుకు పోతున్న హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం కేంద్ర సహకరించాలని అనేకసార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని కెటిఆర్ పేర్కొన్నారు.
9 సంవత్సరాల్లో కేంద్రం నుంచి రాష్ట్రానికి గుండు సున్నా…
9 సంవత్సరాల్లో నగరానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా అందింది గుండు సున్నా అని మంత్రి కెటిఆర్ ఆరోపించారు. తొమ్మిది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం తెలంగాణకు సహకరించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న ద్రోహాన్ని ఇలాగే కొనసాగిస్తుందని అనిపిస్తుందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఒకవేళ కేంద్రం తన వైఖరి మార్చుకోకుంటే ప్రజల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామని కెటిఆర్ తెలిపారు.
స్కై వేల నిర్మాణం కోసం అనేక సార్లు విజ్ఞప్తి చేశాం
హైదరాబాద్ లాంటి నగరంలో స్కై వేల నిర్మాణం కోసం అనేక సార్లు విజ్ఞప్తి చేశామని కెటిఆర్ పేర్కొన్నారు. రక్షణ శాఖ మంత్రులు మారుతున్నా, కేంద్ర ప్రభుత్వ వైఖరి మారడం లేదన్నారు. తొమ్మిదేండ్లలో ఐదుగురు రక్షణ శాఖ మంత్రులను కలిశానని కెటిఆర్ పేర్కొన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి కెసిఆర్, ప్రధాన మంత్రిని కలిసి విజ్ఞప్తి చేసినా ఎలాంటి స్పందన లేదన్నారు. జూబ్లీ బస్టాండ్ నుంచి రాజీవ్ రహదారి వరకు ఒక స్కై వే నిర్మాణం, పారడైజ్ చౌరస్తా నుంచి మేడ్చల్ ఓఆర్‌ఆర్ వరకు

మరో స్కై వే నిర్మాణం, వీటికి రక్షణ శాఖ భూములు ఇవ్వాలని అనేకసార్లు విజ్ఞప్తి చేశామని కెటిఆర్ తెలిపారు. మరోసారి ఈ విషయాన్ని రాజ్‌నాథ్ సింగ్ దృష్టికి తీసుకువెళ్లామని అయినా స్పందన లేదన్నారు. రక్షణ శాఖ నుంచి రాజీవ్ రహదారి వైపు స్కైవేల నిర్మాణం కోసం 96 ఎకరాల భూమి, మేడ్చల్ వైపు మరో 56 ఎకరాల భూమి ఇస్తే అంతే విలువ కలిగిన భూమిని ఇస్తామని చెప్పినా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదని మంత్రి కెటిఆర్ వాపోయారు.
ఉప్పల్ స్కై వాక్ పూర్తి
స్కై వేల మాదిరే స్కై వాక్‌ల నిర్మాణాన్ని కూడా చేస్తున్నామని, ఉప్పల్‌లో చేపట్టిన స్కై వాక్ పూర్తయిందని, సోమవారం దీనిని ప్రారంభిస్తామని కెటిఆర్ తెలిపారు. కానీ, రక్షణ శాఖ పరిమితుల వలన మెహిదీపట్నంలో ప్రారంభించిన ప్రాజెక్టు ఆగిపోయిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. గోల్కొండ, ఇబ్రహీంబాగ్ లింకు రోడ్ల కోసం అవసరమైన రక్షణ భూమిని తాము అడిగామని ఆయన పేర్కొన్నారు. కంటోన్మెంట్‌లో నిరుపయోగంగా ఉన్న భూములను జిహెచ్‌ఎంసికి ఇస్తే అక్కడ ప్రజలకు అవసరమైన ఆస్పత్రులు కమ్యూనిటీ హాల్‌లను నిర్మాణం చేస్తామని కెటిఆర్ తెలిపారు. మా వైపు నుంచి ప్రయత్న లోపం లేకుండా పది సంవత్సరాలుగా ఈ అంశాలను కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈసారి అయినా సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నామని కెటిఆర్ పేర్కొన్నారు.
నేడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ
నేడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలుస్తున్నానని మంత్రి కెటిఆర్ తెలిపారు. లక్డీకాపూల్ నుంచి బిహెచ్‌ఈఎల్ వరకు మెట్రో రైల్ విస్తరణ, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో కోసం విజ్ఞప్తి చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే అనేకసార్లు ఈ అంశంలో డిపిఆర్‌లు ఇచ్చామని కెటిఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద ఎంఎంటిఎస్ కోసం అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినా కేంద్రం నుంచి స్పందన లేదని కెటిఆర్ ఆరోపించారు. ఎస్‌ఆర్‌డిపి కింద అనేక కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశామన్నారు.
మెట్రో విస్తరణకు కేంద్రం కలిసిరావాలి
రసూల్‌పురా వద్ద మూడు, నాలుగు ఎకరాల హోంశాఖ భూమి ఇస్తే అక్కడ ఎస్‌ఆర్‌డిపి ప్రాజెక్టు పూర్తి అవుతుందని కెటిఆర్ తెలిపారు. ఈ విషయంలో కిషన్‌రెడ్డికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేదన్నారు. దీనిపై అమిత్ షాను కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నామని కెటిఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతానికి తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం కలిసి రావాలని కెటిఆర్ సూచించారు. పటాన్‌చెరువు నుంచి హయత్‌నగర్ దాకా మెట్రో విస్తరణ కూడా కేంద్రం కలిసి రావాలని కెటిఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ అభివృద్ధి గురించి కేంద్రమే…
ఇవాళ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని తాము చెప్పుకోవడం కాదనీ, కేంద్ర ప్రభుత్వమే చెబుతుందని కెటిఆర్ తెలిపారు. అయితే ఈ అభివృద్ధి పరంపర కొనసాగే క్రమంలో తెలంగాణ రాష్ట్రం వేగంగా ఎదుగుతూ, విస్తరిస్తూ జాతి నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. కావున ఈ రాష్ట్రానికి చేయూతనివ్వండి, మద్దతు ఇవ్వండి. తద్వారా జాతి నిర్మాణంలో మరింత ఉధృతంగా పాల్గొనే అవకాశం వస్తుందని కెటిఆర్ తెలిపారు. భారతదేశానికి కూడా లాభం జరుగుతుందన్న మాటను కేంద్రానికి చాలాసార్లు చెప్పామని కెటిఆర్ గుర్తు చేశారు.
పెద్ద ఎత్తున లింక్ రోడ్డులు
మహానగరంలో కొత్తగా పెద్ద ఎత్తున లింక్ రోడ్డులు కూడా ఏర్పాటు చేస్తున్నామని కెటిఆర్ తెలిపారు. దాదాపు 142 లింక్ రోడ్లను ప్లాన్ చేశామని ఆయన పేర్కొన్నారు. అందులో రెండు, మూడు కారిడార్లకు సంబంధించి రక్షణ శాఖ భూములు అడ్డు వస్తున్నాయన్నారు. వాటికి కూడా అనుమతివ్వాలని కేంద్ర మంత్రికి ప్రత్యేకంగా చెప్పడం జరిగిందన్నారు. వీటిని కేంద్ర రక్షణ మంత్రి సానుకూలంగా పరిశీలిస్తారని ఆశిస్తున్నామని కెటిఆర్ పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News