Tuesday, May 14, 2024

18 మందిని చంపిన ‘నరహంతకుడు’ రాబర్ట్ కార్డ్ మృతి

- Advertisement -
- Advertisement -

లెవిస్‌టన్ : అమెరికా లోని మైన్ రాష్ట్రంలో ఇటీవల భీకర కాల్పులకు పాల్పడిన నిందితుడు 40 ఏళ్ల రాబర్ట్ కార్డ్ రెండు రోజుల తరువాత శవమై కన్పించాడు. శుక్రవారం రాత్రి అతడి మృతదేహాన్ని పోలీస్‌లు గుర్తించారు. దీంతో రెండు రోజల గాలింపు ఆపరేషన్‌ను పోలీస్‌లు ముగించగా, నిందితుడి మృతితో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. గత బుధవారం రాత్రి మైన్ రాష్ట్రంలోని లెవిస్‌టన్‌లో కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. స్థానికంగా ఓ రెస్టారెంట్లో, టెన్‌పిన్ బౌలింగ్ వేదిక వద్ద ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో కనీసం 18 మంది ప్రాణాలు కోల్పోయారు.

నిందితుడిని 40 ఏళ్ల రాబర్ట్ కార్డ్‌గా గుర్తించారు. ఈ సంఘటన తరువాత పరారైన అతడి కోసం పోలీస్‌లు గాలింపు చేపట్టారు. నిందితుడి వద్ద ఆయుధం ఉండటంతో మళ్లీ కాల్పులకు తెగబడే అవకాశం ఉందని పోలీస్‌లు అనుమానించారు. లెవిస్టన్ నుంచి లిస్బన్ వరకు ప్రజలు, వ్యాపారులు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నిందితుడి ఫోటో కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి లిస్బన్‌లో ఓ రీసైక్లింగ్ సెంటర్ సమీపంలోని చెట్ల పొదల్లో ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీస్‌లకు సమాచారం ఇచ్చారు. రాబర్డ్ కార్డ్‌గా పోలీస్‌లు గుర్తించారు. బుల్లెట్ గాయంతో అతడు మరణించినట్టు పోలీస్‌లు తెలిపారు.

అయితే రాబర్ట్ ఆత్మహత్య చేసుకున్నాడా ? అనేదానిపై మాత్రం స్పష్టతనివ్వలేదు. గతంలో కార్డ్ ఇదే రీసైక్లింగ్ సెంటర్‌లో కొంతకాలం పనిచేసినట్టు పోలీస్‌లు తెలిపారు. ఇదిలా ఉండగా, తాజా పరిణామాలపై మైన్ గవర్నర్ జానెత్ మిల్స్ స్పందిస్తూ రాబర్ట్ కార్డ్‌తో ఇక ఎవరికీ ముప్పు ఉండదని తెలిసి మేం ఊపిరి పీల్చుకున్నాం. అని అన్నారు. రాబర్ట్ కార్డ్ గతంలో ఆర్మీ రిజర్వులో ఒక శిక్షణ కేంద్రంలో ఆయుధ వినియోగ శిక్షకునిగా ఉన్నట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇంతకు ముందు గృహ హింస కేసులో అరెస్టయి విడుదలయ్యాడని , మానసిక సమస్యలతో వేసవిలో రెండు వారాల పాటు చికిత్స పొందాడని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News