Friday, September 19, 2025

పత్తి రైతులందరికీ కనీస మద్ధతు ధర లభించాలి: మంత్రి తుమ్మల

- Advertisement -
- Advertisement -

పత్తి రైతులందరికీ కనీస మద్దతు ధర లభించే విధంగా అధికారులందరూ సమన్వంయంతో పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2025, -26 పత్తి మార్కెటింగ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పత్తి ఉత్పత్తి, మార్కెట్ ధరల పరిస్థితి, ఎంఎస్‌పి(కనీస మద్దతు ధర) అమలు, రైతులకు చెల్లింపులు, జిన్నింగ్, ప్రాసెసింగ్ మిల్లుల ఏర్పాట్లు, రవాణా సమస్యలు, డిజిటలైజేషన్, రైతుల రిజిస్ట్రేషన్, స్థానిక కమిటీలు, ఫిర్యాదు పరిష్కారం వంటి అనేక అంశాలపై సమగ్రంగా చర్చించారు.

సిసిఐ ప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పత్తి సేకరణలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసరమని, దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం కొన్ని నూతన విధానాలు ప్రవేశపెట్టామని, దానికి తగ్గట్టుగా ప్రభుత్వ సహాయం అందించాలని మంత్రిని కోరారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని సహాయ సహకారాలు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో పండే పత్తి ప్రత్యేక నాణ్యత కలిగిందని మంత్రి వివరించారు. ప్రస్తుతం మార్కెట్ ధరలు ఎంస్‌పి కంటే క్వింటాకు రూ.1099 తక్కువగా ఉన్నాయని, ఇది రైతులకు ఆందోళన కలిగిస్తున్నదని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు సిసిఐ సమర్థవంతంగా కొనుగోళ్లు చేపట్టాలని మంత్రిఆదేశించారు.

అక్టోబర్ నుంచే పత్తి సేకరణకు సిద్దం కావాలి
అక్టోబర్ నెల నుంచే పత్తి సేకరణకు ఏర్పాట్లు చేసుకోవాలని, రైతులు ఇబ్బందులు ఎదుర్కోకుండా రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను 110 నుండి 122కి పెంచినట్లు మంత్రి వెల్లడించారు. అదనంగా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొత్తగా కొనరావుపేట ఏఎంసి కేంద్రాన్ని కూడా చేర్చాలని సూచించారు. రైతులు తమ పత్తిని సులభంగా విక్రయించుకునేందుకు జిన్నింగ్, ప్రాసెసింగ్ మిల్లులు, గోదాములు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.రైతులకు ఎంఎస్‌పి చెల్లింపులు పూర్తిగా ఆధార్ ఆధారిత ధృవీకరణ తర్వాతే నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి తెలిపారు. దీంతో రైతులకు పారదర్శకంగా, ఆలస్యం లేకుండా చెల్లింపులు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

సిసిఐ ప్రవేశ పెట్టిన కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు స్వయంగా స్లాట్ నమోదు చేసుకోవచ్చని మంత్రి చెప్పారు. ఈ యాప్ పై ఏఇవో లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, వారి ద్వారా రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కౌలు రైతులు కూడా ఓటిపి ఆధారంగా నమోదు చేసుకునే వీలుంటుందని, అయితే వారి వివరాలు సంబంధిత పట్టాదారు ధృవీకరించిన తర్వాతే ఆమోదం పొందుతాయని మంత్రి స్పష్టం చేశారు. ఈ విధానం వల్ల అర్హత కలిగిన ప్రతి రైతు ఎంఎస్‌పి ప్రయోజనం పొందే అవకాశం ఉంటుందని మంత్రి వెల్లడించారు. రైతులు ఎల్1, ఎల్2 స్లాట్ల ద్వారా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని, అలాకాకుండా నూతన పద్ధతిలో సెంటర్ కు 10,15 కి.మి పరిధిలో ఉండేలా సెంటర్ ను కేటాయించాలని మంత్రి సూచించారు.

మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేయండి
రైతుల పత్తి కొనుగోళ్లు సక్రమంగా జరిగేందుకు ప్రతి కొనుగోలు కేంద్రంలో స్థానిక మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ కమిటీలు తేమ శాతం, నాణ్యత, తూకం, ధరల విషయంలో రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా పర్యవేక్షిస్తాయని తెలిపారు. రైతుల ఫిర్యాదుల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800 599 5779, వాట్సాప్ హెల్ప్‌లైన్ నెంబర్ 88972 81111 కొనసాగుతాయని తెలిపారు. ప్రతి కొనుగోలు కేంద్రం, జిన్నింగ్, ప్రాసెసింగ్ మిల్లులలో సిసి కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, రోజువారి క్రయ విక్రయాలను పరిశీలించేందుకు డైరెక్టరేట్ లో కమాండ్ కంట్రోల్ రూం సెంటర్ ఏర్పాటు చేయాలని మంత్రి చెప్పారు.

రవాణా సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, స్థానిక రవాణా సంఘాలు అధిక ధరలు వసూలు చేస్తున్నందున, గోదాముల నుండి మిల్లులకు పత్తి రవాణాలో ఆటంకాలు కలుగుతున్నాయని గుర్తించామని మంత్రి వెల్లడించారు. ఈ సమస్యలను తక్షణం పరిష్కరించేలా రవాణా శాఖ, జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. సిసిఐ కొనుగోలు విధానంలో కొన్ని మార్పులను మంత్రి సూచించారు. లింట్ శాతం పెంపు, కొరత శాతం లెక్కింపు, జిన్నింగ్ మిల్లులు పాల్గొనకపోవడం వంటి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు. సిసిఐ టెండర్ నిబంధనలు పారదర్శకంగా ఉండాలని మంత్రి పేర్కొన్నారు.

రైతుల ఎంఎస్‌పి రక్షణకు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ కమిటీలు ధరల అమలును పర్యవేక్షించి, సిసిఐతో ప్రారంభానికి ముందే ఈ కమిటీల ఏర్పాటుకు ప్రణాళిక రూపోందించాలని మంత్రి సూచించారు. రైతులకు ఎంఎస్‌పి హామీగా అందించడం ప్రభుత్వ ప్రధాన లక్షమని, పత్తి రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా పారదర్శకంగా, వేగంగా కొనుగోళ్లు జరిగేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. సిసిఐ, మార్కెటింగ్ శాఖ, జిల్లా కలెక్టర్లు, రైతుల సంఘాలు సమన్వయంతో పనిచేస్తే ఈ సీజన్ విజయవంతంమవుతుందని మంత్రి స్పష్టం చేశారు.

Also Read: విషాదం: హీరోయిన సదాకు పితృవియోగం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News