మన తెలంగాణ/సిరిసిల్ల: కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీద్వారా జిల్లాలోని రైతులకు అక్టోబర్ లోగా సాగునీటిని అందిస్తామని ఐటి, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. మంత్రి కెటిఆర్ సిరిసిల్లలో తన క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ అధికారులు, రైతు సమన్వయ సమితి సభ్యులతో కలెక్టర్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుగారి ఆలోచనలమేరకు నియంత్రిత పంటల సాగు, ప్రధానంగా సన్నరకం బియ్యం అందించే వరిధాన్యం సాగు, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహరక మందులు, సాగునీటి సదుపాయం తదితర అంశాలపై మంత్రి సమీక్షా సమావేశంలో పలు సూచనలు చేశారు.
కాళేశ్వరం ప్యాకేజి 9,10,11,12లకు సంబంధించిన పనులన్నీ దసరా నాటికి సంపూర్ణంగా పూర్తయ్యేలా చేసి జిల్లాలోని 2లక్షల 72 వేల ఎకరాలకు సాగునీరందించాలని అధికారులకు వివరించారు. అదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వార వచ్చే గోదావరి నీటిని జిల్లాలోని 666 చెరువులకు గాను మధ్యమానేరు జలాశయం నుండి 85 శాతం పైగా చెరువులను నింపేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ అధికారులు ఏయే ప్రాంతంలోని భూముల్లో ఏయే పంటలు పండించాలని సూచిస్తే వాటినే పండించి రైతులు ఆర్థికంగా లాభాలు గడించాలన్నారు.రైతు సంక్షేమమే ధ్యేయంగా అనేక చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం తమదన్నారు.రైతులకు ఎలాంటి సమస్యలున్నా తక్షణమే అధికారుల దృష్టికి తెస్తే పరిష్కరిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, అదనపు కలెక్టర్ అంజయ్య, జిల్లా పరిషత్ చైర్మన్ అరుణ, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు గడ్డం నర్సయ్య, డిఏఓ రణధీర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Minister KTR Review Meeting with Agriculture Officers