Thursday, May 2, 2024

బస్సు సౌకర్యం కావాలనిపిస్తే చెప్పండి.. ఏర్పాటు చేస్తా: మంత్రి పొన్నం

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొని ప్రజలనుండి ప్రభుత్వ గ్యారంటీ పథకాలపై దరఖాస్తులను రాష్ట్ర రవాణ బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఆర్డీఓ బెన్ షాలేం, మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, ఏసీపీ సతీష్, మున్సిపల్ కమిషనర్, స్థానిక కౌన్సిలర్ పద్మ, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి ఓటు వేస్తే ఎమ్మెల్యేగా ఎంపికై పార్టీ ఆదేశాలతో రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించానని చెప్పారు. ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డ లాగే నేను మీ మనిషిని మీకు ఏ సమస్య ఎదురైనా నా దృష్టికి తీసుకువస్తే వెంటనే స్పందించి పరిష్కరించే బాధ్యత తనదన్నారు. రేపటికీ ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు అవుతుందన్న పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే క్యాబినెట్లో గ్యారెంటీలపై చర్చ జరిగిందని తెలిపారు. ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేయడం జరిగిందన్నారు. డిసెంబర్ 28 నుండి ప్రజాపాలన కార్యక్రమంలో ద్వారా ప్రభుత్వ గ్యారంటీలపై దరఖాస్తులను స్వీకరిస్తున్నాము.. నేటితో దరఖాస్తుల స్వీకరణ ముగుస్తోందన్నారు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ముఖ్యమంత్రి చెెప్పారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇంటికి దరఖాస్తులను అందజేసి దరఖాస్తులను స్వీకరిస్తున్నామన్నారు.

హుస్నాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికే 85 వేల అప్లికేషన్లను స్వీకరించామని చెప్పారు. గత ప్రభుత్వం ఎన్ని అప్పులు మిగిల్చినా కూడా ప్రజలకు మంచి చేయాలని దృఢ నిశ్చయంతో ప్రభుత్వం ఉందన్నారు. ప్రభుత్వం వచ్చి నెల రోజులలోనే 420 అని విమర్శించడం తగదని సూచించారు. ప్రజాస్వామ్య పునరుద్దానంలో భాగంగా హైదరాబాదులో ధర్నా చౌక్ ను ప్రారంభించామని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా అవసరమైన రిపేర్లు పూర్తి చేసి అందిస్తామని వెల్లడించారు.

ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే ముస్తాబాద్ మున్సిపాలిటిని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, సిడిఎంఏ బృందం నిన్ననే హుస్నాబాద్ కు వచ్చి పరిశీలించిందని చెప్పారు. సమాజానికి ఉపయోగపడే పనిచేసిన గౌరవెల్లి నిర్వాసితులతో దురుసుగా ప్రవర్తించకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రవర్తించి సమస్య పరిష్కరిస్తామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ మధ్యనే రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించామని, ఇంకా 2000 ఎకరాల భూసేకరణ చేసి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్మిస్తామని పేర్కొన్నారు. దేవాదుల, శ్రీరామ్ సాగర్, వరద కాలువ ఫేస్ 2 ద్వారా నీళ్లు వచ్చేలా చర్యలు చేపడతామని తెలిపారు.

మున్సిపల్ పట్నంలోని హమాలీలకు హెల్త్ ప్రొఫైల్ టెస్ట్ చేపించే అవసరమైన వైద్య సేవలు అందిస్తామని ఆయన వెల్లడించారు. నిమ్స్ ఎం.ఎన్.జె తదితర ఆస్పత్రులలో వైద్య సేవల కోసం వస్తే ఒక ప్రత్యేక వ్యక్తిని అందుబాటులో ఉంచి ప్రత్యేకమైన వైద్య సేవలు రాజకీయాలకతీతంగా ఈ ప్రాంతం వారికి చేయిస్తామన్నారు. విద్యా, వైద్యం, గృహవసతి, ఉద్యోగులు, సామాన్య ప్రజలు, రైతుల తదితరులు అందరి సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. హుస్నాబాద్ నుండి ఏ ప్రాంతానికైనా బస్ సౌకర్యం కావాలనిపిస్తే నాకు చెప్పండి… ఏర్పాటు చేస్తానని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. హుస్నాబాద్ బస్ డిపోను బలోపేతం చేస్తానన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎక్కడికి వెళ్లిన గౌరవం పెరిగేలా మీ ఇమేజ్ ని పెంచుతానని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News