Tuesday, April 30, 2024

మన ఊరు మనబడి ద్వారా రూ. 290 కోట్లు

- Advertisement -
- Advertisement -

Minister Srinivas Goud inauguration midday meal scheme

విద్యార్థులు కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాలు సాధించాలి

పాలమూరుకు జాతీయ హోదాపై కేంద్రం నిర్లక్ష్యం

విద్యావ్యవస్థలో అనేకమార్లు వచ్చాయి

మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవంలో మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్: తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చినట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, యువజన సర్వీసులు, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం సీఎం కేసీఆర్ ప్రారంభించిన మన ఊరు మనబడి పథకం ద్వారా జిల్లాకు రూ. 290 కోట్లు విడుదలయ్యాయని ఆయన తెలిపారు. శుక్రవారం నాడు మహబూబ్ నగర్ గ్రామీణ మండలం, కోట కదిర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అక్షయపాత్ర సహకారంతో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… జిల్లాలో విద్యాపరంగా అనేక మార్పులు తీసుకువచ్చామని, రాష్ట్రవ్యాప్తంగా 1000 గురుకులాలు పెడితే మహబూబ్ నగర్ లోనే 20 ఉన్నాయని, 20 గురుకుల పాఠశాలలతో పాటు.. రూ.293 కోట్లతో పాఠశాల భవనాల నిర్మాణం చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను విద్యార్థులు శ్రద్ధగా విని, కష్టపడి చదివితే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని అన్నారు. అక్షయపాత్ర ద్వారా శుక్రవారం నుండి 4947 మంది విద్యార్థులకు 47 పాఠశాలల్లో నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు 10వ తరగతి తర్వాత చదివే అంశాలపై అవగాహన కల్పించాలని, డిగ్రీ వరకు పర్యవేక్షిస్తే వారు ఏదో ఒక రంగంలో నిలదొక్కుకుంటారని ఆన్నారు.

మహబూబ్ నగర్ జిల్లా ఊహించిన విధంగా అభివృద్ధి సాదించిందని, గతంలో తాగడానికి కూడా మంచినీరు ఉండేది కాదని, ఇప్పుడు ప్రతిరోజు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తున్నామని, 24 గంటల విద్యుత్తు, పెన్షన్లు, రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటివి అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లానుండి వలసలు వెళ్లే పరిస్థితి నుండి వలసలు వాపస్ వస్తున్నారని అన్నారు. అక్బర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పై మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన మండిపడ్డారు.

మన్యంకొండ దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేశామని, ముఖ్యంగా పెద్ద ఆర్చితో పాటు, షాప్స్ ఏర్పాటు చేసి షాపులను హోటళ్ల, ఇతర వ్యాపారాలు చేసుకొనే ఏర్పాటు చేశామన్నారు. ఒకేసారి 100 మంది వివాహాలు చేసుకునే విధంగా పెద్ద షెడ్డు నిర్మాణం చేయించామన్నారు. ఏసీ ఫంక్షన్ హాల్ నిర్మాణంలో ఉందని రూ. 15 కోట్లతో టూరిజం హోటల్ ను త్వరలోనే చేపట్టబోతున్నామని, ఇప్పటికే కొండపైన 18 రూములతో వసతి కల్పిస్తున్నామని తెలిపారు. కోనేటిని కృష్ణ నీటితో నింపామన్నారు. జిల్లాలో అన్ని శాఖలు ఒకే దగ్గర వచ్చేలా ఇంటిగ్రేటెడ్ కార్యాలయాల భవన సముదాయం త్వరలోనే ప్రారంభం కానుందని, పాత కలెక్టరేట్ స్థానంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తున్నామని, కరివేన, ఉదండపూర్ రిజర్వాయర్లను పూర్తిచేస్తే జిల్లా సస్యశ్యామలమవుతుందని, అలాగే డబుల్ రైల్వే లైన్ త్వరలో పూర్తికానుందన్నారు.

ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ఎంపీపీ సుధాశ్రీ, జెడ్పీటీసీ వేంకటేశ్వరమ్మ, వైస్ ఎంపీపీ అనిత, సర్పంచ్ రమ్య దేవేందర్ రెడ్డి, డీఈఓ రవీందర్, అక్షయపాత్ర ఇంచార్జీ కృష్ణప్రసాద్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా డైరెక్టర్ మల్లు నర్సింహా రెడ్డి, రైతు బంధు సమితి మండల డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, పీఆర్టీయు జిల్లా అధ్యక్షుడు నారాయణ గౌడ్, ప్రధాన కార్యదర్శి రఘురాం రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News