కాళేశ్వరం ప్రాజెక్టు కచ్చితంగా అవినీతి ప్రాజెక్టేనని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. ఆ ప్రాజెక్టు అంచనాలు పెంచి అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ఈ అవినీతిపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆధారాలతో సహా చెప్పగానే బీఆర్ఎస్ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సోమవారం నాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్పై బిఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
‘కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో మా పార్టీది, మా అందరిదీ ఒకే మాట అని అన్నారు. ఈ ప్రాజెక్టు అవినీతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గతంలో చేసిన వ్యాఖ్యలకే తాము కట్టుబడి ఉన్నామని రాజాసింగ్ తెలిపారు. ప్రధాని మోడీ చెప్పినట్లుగా, బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. కేవలం రూ.8 వేల కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును రీడిజైనింగ్ పేరుతో ఏకంగా రూ.1.20 లక్షల కోట్లకు పెంచిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.