న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్పై ప్రజలను తప్పుతోవ పట్టించే ప్రయత్నం జరిగినప్పటికీ ప్రస్తుత ప్రపంచ ఆర్ధిక పరిస్థితుల నేపథ్యంలో ఇది మంచి బడ్జెట్ అని విమర్శకులే అంగీకరిస్తున్నారని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. త్రిపురలో బ్రూ గిరిజన తెగ సమస్యలకు సంబంధించి బోడో ఒప్పందం కుదుర్చుకోవడం ఈ దశాబ్దంలో తమ ప్రభుత్వం సాధించిన చారిత్రక విజయంగా చెప్పుకొచ్చారు. దశాబ్దాలుగా రక్తసిక్తమై హింసతో అల్లాడుతున్న ఈశాన్య ప్రాంతంలో దీనివల్ల శాంతి సమకూరుతుందని తెలిపారు. పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైన తరువాత మొదటి సారి పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరైన బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాను మోడీ తదితర నేతలు సత్కరించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని నడ్డా వెలిబుచ్చారు. ఢిల్లీ మురికివాడల్లో దాదాపు 240 మంది పార్టీ ఎంపిలు ప్రజలతో మమేకమై అనేక రోజులు గడిపారని ఆయన చెప్పారు.