Thursday, May 2, 2024

మరో ఉద్దీపన ప్యాకేజీ

- Advertisement -
- Advertisement -

పర్యాటకం, విమానయానం, చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహకాలు
సిద్ధం చేస్తున్న ఆర్థిక మంత్రిత్వశాఖ


న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్‌తో పలు రంగాలు దారుణంగా దెబ్బతినడంతో దేశీయ ఆర్థిక వృద్ధి రేటు క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో పలు రంగాలకు ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. లాక్‌డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రంగాలకు ప్యాకేజీలో ప్రాధాన్యతనివ్వనున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్‌ను నియంత్రించేందుకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించాయి. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం అత్యంతగా ప్రభావితమైన రంగాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలనుకుంటోందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది. కరోనా సెకండ్ వేవ్‌తో అత్యంతగా దెబ్బతిన్న పర్యాటకం, విమానయానం, ఆతిథ్యం వంటి రంగాలను వేగవంతం చేసేందుకు ఆర్థిక మంత్రిత్వశాఖ కసరత్తు చేస్తోంది.

వీటిలో చిన్న, మధ్య తరహా కంపెనీలు కూడా ఉండే అవకాశముంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ప్రాథమిక స్థాయి చర్చల దశలో ఉంది. ఈ ప్రతిపాదనల ప్రకటనకు సంబంధించి సమయం నిర్ణయించలేదు. అయితే ఈ విషయంలో స్పందించడానికి ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రతినిధి నిరాకరించారు. సెకండ్ వేవ్ భారతదేశాన్ని కోవిడ్ -19 అంటువ్యాధి ప్రపంచ హాట్‌స్పాట్‌గా మార్చింది. గత సంవత్సరం మాదిరిగా కఠినమైన లాక్‌డౌన్ ఆంక్షలు విధించడానికి ప్రధాని నరేంద్ర మోడీ నిరాకరించినప్పటికీ, మార్చిలో కోవిడ్ కేసులు తీవ్రతరం కావడంతో రాష్ట్రాలకే నిర్ణయాలను వదిలేశారు.

దేశంలో రోజుకు 2 లక్షల కరోనా కేసులు నమోదవడంతో అప్రమత్తమైన రాష్ట్రాలు లాక్‌డౌన్ ఆంక్షలు విధించాయి. వీటిలో అత్యధిక పరిశ్రమలు ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా చాలా మంది ఆర్థికవేత్తలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (202122) వృద్ధి అంచనాలను తగ్గించారు. పెరుగుతున్న నిరుద్యోగం రేటు, పొదుపు తగ్గడం వల్ల రెండంకెల వృద్ధికి అవకాశం లేకుండా పోయింది. అయితే అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12.5 శాతం వృద్ధిని అంచనా వేసింది. అదే సమయంలో ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) వృద్ధి రేటు 10.5 శాతంగా అంచనా వేసింది.

గతేడాది 20.97 లక్షల కోట్ల ప్యాకేజీ

కోవిడ్ 19 మహమ్మారితో గతేడాది ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. 2020 మే నెలలో రూ .20.97 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఐదు దశల్లో చేసిన ఈ ప్రకటనలో దాదాపు అన్ని రంగాలకు ఉపశమనం లభించింది. ఇవే కాకుండా వ్యాపారాలకు ఉపశమనం కలిగించడానికి ఆర్‌బిఐ రుణ తాత్కాలిక నిషేధం (మారటోరియం), రుణ పునర్నిర్మాణం, కొన్ని రంగాలకు రుణాల కోసం నిధుల కేటాయింపు వంటి ప్రకటనలను కూడా చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News