Friday, May 3, 2024

నిజాం కళాశాల్లో ఆ కోర్సు ఉపసంహరణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నిజాం కళాశాలలో ఆచరణ సాధ్యం కాని ఐదేళ్ల ఎమ్మెస్సీ కెమిస్ట్రీ ఇంటిగ్రేటెడ్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సును ఉపసంహరించుకుంటున్నట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఈ నిర్ణయం 2023-24 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. యూనివర్శిటీ ఆదేశాలతో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల తీరుతెన్నులను సమీక్షించిన నిజాం కళాశాల ప్రిన్సిపల్ తన నివేదికను సమర్పించారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎప్పటికప్పుడు కోర్సుల ప్రగతిని సమీక్షిస్తోంది. మార్కెట్ కు అనుగుణంగా డిమాండ్ ఉన్న కోర్సులను ప్రవేశపెడుతూ వస్తోంది.

ఇటీవల కాలంలో కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ సహా అనేక కొత్త కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. ఎప్పటికప్పుడు పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా కొత్త సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను అందిస్తోంది. అదే సందర్భంలో వివిధ కారణాలతో ఆచరణ సాధ్యం కాని కోర్సులను ఉపసంహరించుకుంటోంది. అందులో భాగంగానే నిజాం కళాశాల నుంచి ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కెమిస్ట్రీ కోర్సును రానున్న విద్యా సంవత్సరం నుంచి ఉపసంహరించుకుంటూ నిర్ణయం తీసుకుంది. సమానత్వం, విద్యా నిష్క్రమణ సమస్యలు, ఆర్థిక పరిమితులు, అభివృద్ధి ఇలా అనేక అంశాలను పరిశీలించిన తర్వాతే ఈ కోర్సు పెద్దగా ఆచరణీయం కాదని అందుకే ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది.

విద్యార్థుల ఆసక్తిని ఆకర్షించడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం నిజాం కళాశాలలో సంవత్సరాల తరబడి ఈ కోర్సును కొనసాగించడానికి గట్టి ప్రయత్నాలు చేసింది. దురదృష్టవశాత్తు ఈ కోర్సు లక్షిత ఆర్థిక, ఇతర విద్యాపరమైన సవాళ్లను ఎదుర్కోలేకపోయింది. విద్యా ప్రమాణాలు, నాణ్యమైన విద్య అందించటం యూనివర్శిటీకి సవాల్ గా మారటంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు యూనివర్శిటీ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ కోర్సులో విద్యాభ్యాసం చేస్తున్న వారికి కోర్సు పూర్తయ్యేంత వరకు తగిన విద్యా ప్రమాణాలను అందిస్తామని స్పష్టం చేసింది.

Read Also: మణిపూర్ సంక్షోభం ప్రధానికి పట్టలేదు: రాహుల్ గాంధీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News