స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ బ్యానర్స్పై ఎస్.రాధాకృష్ణ, అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం ఈనెల 12న విడుదలవుతుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్కి అద్భుతమైన స్పందన రావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్ యూసుఫ్గూడలోని పోలీస్ గ్రౌండ్స్లో ‘అల వైకుంఠపురంలో… మ్యూజికల్ ఫెస్టివల్’ను వైభవంగా, వినూత్నంగా నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కోసం 52 అడుగుల పొడవు, 162 అడుగుల వెడల్పుతో స్టేజ్ని డెకరేట్ చేయనున్నారు.
సౌత్ ఇండియాలో ఇంత భారీగా స్టేజ్ వేయడం ఇదే మొదటిసారి. అలాగే ఈ ఫంక్షన్లో తమన్, శివమణి, సిద్ శ్రీరామ్, అర్మాన్ మాలిక్, రాహుల్ సిప్లిగoజ్, రోల్ రైడ, లేడి కాశ్, రాహుల్ నంబియార్, అనురాగ్ కులకర్ణి, ప్రియ సిస్టర్స్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. అలాగే ఎమ్.జె. 5 డ్యాన్స్ , ఇండియన్ రాగా వారు స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు. అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్కర్, తనికెళ్ల భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, కల్యాణి నటరాజన్, రోహిణి, ఈశ్వరీ రావు, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, రాహుల్ రామకృష్ణ, పమ్మి సాయి తదితరులు ఈ చిత్రంలో ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కెమెరామెన్ః పి.ఎస్.వినోద్, సంగీతం: తమన్.ఎస్, ఎడిటర్: నవీన్ నూలి: ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, ఫైట్స్: రామ్, లక్ష్మణ్.