న్యూఢిల్లీ: ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు చెందిన విద్యార్థుల అభ్యసన సామర్ధాన్ని అంచనా వేసేందుకు ఈ ఏడాది నవంబర్లో నేషనల్ అచీవ్మెంట్ సర్వేను(ఎన్ఎఎస్) ఎన్సిఇఆర్టి నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. 2017లో 3,5,8 తరగతి విద్యార్థులకు ఎన్ఎఎస్ నిర్వహించగా 2018లో 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించారు. దేశంలో పాఠవాల విద్యావిధానాన్ని ముఖ్యంగా ప్రస్తుతం పెరుగుతున్న ఆన్లైన్ తరగతుల నేపథ్యంలో విద్యా ప్రమాణాలను అంచనా వేసేందుకు ఈ అధ్యయనాన్ని లేదా సర్వేను నిర్వహిస్తున్నట్లు సోమవారం లోక్సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో మంత్రి తెలిపారు.
దేశంలోని మొత్తం 34 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 610 జిల్లాలకు చెందిన 44,304 పాఠశాలల్లోని 15 లక్షల మంది విద్యార్థుల అభ్యసన స్థాయిని ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్స్, మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ వంటి ఐదు పాఠ్యాంశాలలో అధ్యయనం చేసినట్లు ఆయన చెప్పారు. ఈ ఏడాది నవంబర్లో దేశవ్యాప్తంగా మరో విడత సర్వేను నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.