హైదరాబాద్: దేశంలో ఆయిల్పామ్ సాగుచేస్తున్న రైతుల ఆదాయాలను రెట్టింపు చేయడమే ప్రధాన ధ్యేయంగా ఏప్రిల్ నెలలో హైదరాబాద్ వేదికగా జాతీయ ఆయిల్పామ్ సదస్సు జరుగనుంది. రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగు విస్తరణకు అపారమైన అవకాశాలుండటంతో.. రైతులకు ఆధునిక సాగు పరిజ్ఞానం పెరిగేందుకు అవకాశాలుంటాయి. హైదరాబాద్లో నిర్వహించే సదస్సుకు మలేషియా, ఇండోనేషియా, థాయ్లాండ్, కోస్టారికా దేశాల నుంచి నిపుణులు హాజరుకానున్నారు.
ఈ మేరకు సోమవారం ములుగులోని తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రధానకార్యాలయయంలో వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారధి అధ్యక్షతన సన్నాహాక సమావేశం జరిగింది. భారత ఆయిల్పామ్ పరిశోధన సంస్థ, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ, కేంద్ర వ్యవసాయశాఖ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించనున్నాయి.
ప్రస్తుతం 1.4 కోట్ల టన్నుల నూనెను ఇండోనేషియా, మలేషియా, అర్జెంటీనా, బ్రెజిల్దేశాల నుంచి మన దేశం దిగుమతి చేసుకుంటుందన్నారు. దేశంలో నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం 20 లక్షల హెక్టార్లలో 18 రాష్ట్రాలలో ఆయిల్పామ్ సాగు విస్తరణకు అవకాశాలుంటే, కేవలం 3.45 లక్షల హెక్టార్లు మాత్రమే విస్తరణ జరిగిందని చెప్పారు. ఏప్రిల్ 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు జరుగనున్న ఈ సదస్సులో ఎక్స్పో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జినోమ్ సీక్వెన్సింగ్, డిజిటల్ టెక్నాలజీలు, స్మార్ట్ఫార్మింగ్తో పాటు అధిక దిగుబడినిచ్చే ఆధునిక రకాలతో ఆయిల్పామ్ ఉత్పాదకత పెంచేందుకు ఈ సదస్సులో నిపుణులు చర్చిస్తారని, అందులో రైతులుకూడా పాల్గొంటారని తెలిపారు.
తక్కువ నీరు అందుబాటులో ఉన్న నేలల్లో అధిక ఆయిల్పామ్ దిగుబడిని సాధించేందుకు దిశానిర్దేశం చేసే పలు శాస్త్రీయ విషయాలు ఈ సదస్సులో చర్చించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో ఆయిల్పామ్ పరిశోధన సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్కే మాథుర్, ఆయిల్పామ్ ప్రొమోషన్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ పి.రెతికం, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ భగవాన్ తదితరులు పాల్గొన్నారు.