ముంబై : వైద్య విద్యను అభ్యసించడం ఇష్టం లేక ఓ విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. నీట్లో 99.99 శాతం సాధించి, కళాశాల అడ్మిషన్ రోజే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.న సూసైడ్ నోట్ను పోలీసులు గుర్తించారు. నవర్గావ్ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల విద్యార్థి, ఇటీవల నీట్ యూజీ 2025లో 99.99 శాతం సాధించాడు. జాతీయ స్థాయిలో 1475 ర్యాంకును దక్కించుకున్నాడు.
ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ లోని కళాశాలలో ఎంబీబీఎస్ కోర్సులో అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంది. అక్కడికి వెళ్లేందుకు అంతా సిద్ధం అవుతుండగా, ఆ విద్యార్థి తన ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అడ్మిషన్ తీసుకొని వైద్యవిద్యను పూర్తి చేస్తాడనుకున్న కుమారుడు అలా మృతి చెందేసరికి కుటుంబం షాక్కు గురైంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రదేశంలో సూసైడ్ నోట్ను గుర్తించారు. ఆ నోట్లో ఉన్న పూర్తి వివరాలు బయటకు వెల్లడికానప్పటికీ, తనకు ఎంబీబీఎస్ చదవాలని లేదని ఆ విద్యార్థి అందులో పేర్కొన్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నాయి.