పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న ముక్కోణపు వన్డే టోర్నమెంట్లో న్యూజిలాండ్ వరుసగా రెండో విజయం సాధించింది. సోమవారం సౌతాఫ్రికాతో జరిగిన రెండో మ్యాచ్లో కివీస్ ఆరు వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. అంతకుముందు తొలి మ్యాచ్లో ఆతిథ్య పాకిస్థాన్ను కివీస్ ఓడించింది. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 304 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఆరంగేట్రం మ్యాచ్ ఆడిన ఓపెనర్ మాథ్యూ బ్రిట్జ్కె చిరస్మరణీయ సెంచరీని సాధించాడు. కివీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న బ్రిట్జ్కె 148 బంతుల్లో ఐదు సిక్సర్లు, 11 బౌండరీలతో 150 పరుగులు చేశాడు.
ఈ క్రమంలో తొలి మ్యాచ్లోనే 150 పరుగులు చేసి కొత్త ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. జాసన్ స్మిత్ (41), ముల్డర్ (64) పరుగులు చేశారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 48.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ డెవోన్ కాన్వే, కేన్ విలియమ్సన్ అద్భుత బ్యాటింగ్తో కివీస్ను గెలిపించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన కాన్వే 107 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్తో 97 పరుగులు సాధించాడు. ఇదే క్రమంలో కేన్తో కలిసి రెండో వికెట్కు 187 పరుగులు జోడించాడు. మరోవైపు చెలరేగి ఆడిన విలియమ్సన్ 113 బంతుల్లోనే 13 ఫోర్లు, రెండు సిక్సర్లతో అజేయంగా 133 పరుగులు సాధించాడు. అతనికి గ్లెన్ ఫిలిప్స్ 28 (నాటౌట్) అండగా నిలిచాడు.