ఢిల్లీ : ఢిల్లీలో నిర్భయపై దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి, పాశవికంగా వ్యవహరించి ఆమె హత్యకు కారణమైన ఘటనలో నిర్భయ దోషులందర్నీ ఒకేసారి ఉరి తీయనున్నారు. ఈ మేరకు తీహార్ జైల్లో నాలుగు ఉరికంభాలను అధికారులు సిద్ధం చేశారు. ఆ ఉరికంభాలతో పాటు నాలుగు సొరంగాలను కూడా నిర్మించారు. నిర్భయ దోషులైన పవన్, ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్కి ఒకేసారి ఉరిశిక్ష అమలు చేయనున్నారు. వీరి ఉరిశిక్షపై 7వ తేదీన డెత్ వారెంట్లపై ఢిల్లీ పటియాల కోర్టు తీర్పు వెలువరించనుంది. కాగా, డిసెంబర్ 16, 2012లో నిర్భయపై కదులుతున్న బస్సులో ఆరుగురు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఆతర్వాత బాధితురాల్ని నడిరోడ్డుపై పడేశారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 13రోజుల పాటు పోరాడిన నిర్భయ చివరకు ప్రాణాలు విడిచింది. ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా తీవ్ర గాయాలపాలై ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ కేసులో మొత్తం ఆరుగుర్ని దోషులుగా గుర్తించగా వారిలో ఒకడు తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరొక వ్యక్తి మైనర్ కావడంతో జువెనైల్ చట్టాల ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష తర్వాత రిలీజ్ అయ్యాడు. మిగతా నలుగురూ తీహార్ జైల్లో ఉన్నారు.