Sunday, April 28, 2024

జోరుగా నామినేషన్ల దాఖలు

- Advertisement -
- Advertisement -

పెద్ద ఎత్తున ర్యాలీలతో అభ్యర్థుల సందడి
నామినేషన్లు దాఖలు చేసిన ఈటల, కోమటిరెడ్డి, పల్లా, రఘునందన్‌రావు

మనతెలంగాణ/ హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ల పర్వం జోరుగా కొనసాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓవైపు.. స్వతంత్ర అభ్యర్థులు మరోవైపు భారీ ఏర్పాట్లతో రిటర్నింగ్ కార్యాలయాలకు చేరుకుని నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మంగళవారం కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జీవన్‌ రెడ్డి, బిఆర్‌ఎస్ నేత ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, బిజెపి నేతలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావుతో పాటు పలువురు ప్రముఖులు నామినేషన్లు దాఖలు చేశారు.

జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. నామినేషన్‌కు ముందు కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ఆయన అక్కడి నుంచి భారీ ర్యాలీగా రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ వేశారు. పెద్దపల్లి నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా దాసరి ఉష నామినేషన్ వేశారు. హనుమకొండ జిల్లా పరకాల బిజెపి అభ్యర్థిగా డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ నామినేషన్ వేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా రావు పద్మ నామినేషన్ పత్రాలను రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో అందజేశారు. జనగామ ఆర్డీవో కార్యాలయంలో బిఆర్‌ఎస్ అభ్యర్థి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి రెండు సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. ఆయన వెంట ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రాజయ్య, పొన్నాల లక్ష్మయ్య తదితరులు ఉన్నారు.

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో బిజెపి అభ్యర్థిగా ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి బిఆర్‌ఎస్ అభ్యర్థిగా మెదక్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే స్వగ్రామం కోనాపూర్ పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.

రాష్ట్రంలో చిల్లర రాజకీయాలు జరుగుతున్నాయని.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో బహుజన ముక్తి పార్టీ తరఫున చంద్రకాంత్.. చిల్లర నాణేలతో నామినేషన్ దాఖలు చేసేందుకు ప్రయత్నించగా.. ఆర్‌ఓ నిరాకరించడంతో నగదు చెల్లించారు. జగిత్యాలలో 82 ఏళ్ల వృద్దురాలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేసింది.. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం క్యూరిక్యాల గ్రామానికి చెందిన చీటి శ్యామల తన బంధువులతో కలిసి నామినేషన్ వేసింది. తన కుటుంబ సమస్యను అధికారులకు, ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో నామినేషన్ వేశానని శ్యామల పేర్కొంది.

Raghunandan-Rao

Palla Rajeshwar Reddy

Komati Reddy

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News