Friday, March 29, 2024

సివిల్ సర్వీసెస్ కోచింగ్ కోసం నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఈ ఏడాది షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖకు చెందిన రాష్ట్ర స్టడీసర్కిల్‌లో సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్ కోచింగ్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు స్టడీసర్కిల్ డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో వెల్లడిస్తూ గ్రేటర్ నగరంలో ఉన్న రాష్ట్ర స్టడీ సర్కిల్‌లో ఈ సంవత్సరం కోచింగ్ కోసం 100 మందిని రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తామని, ఎంపికైన అభ్యర్థులకు ఉచిత భోజనము వసతితో కూడిన పది నెలల కోచింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

ప్రిలిమినరీ, మెయిన్స్ సబ్జెక్టులలో (పాలిటి, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ, కల్చర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ ఇష్యూస్, కరెంట్ అఫైర్స్) దాదాపు వెయ్యి గంటలకు పైగా, ఆప్షనల్ సబ్జెక్టులపై ఒక్కదాని కోసం 150 నుంచి 200 గంటలకు పైగా కోచింగ్ పేరు మోసిన ఫ్యాకల్టీలచే కోచింగ్ ఇప్పిస్తామన్నారు. ఏఏ సబ్జెక్టులకు ఆఫ్‌లైన్ కోచింగ్ సాధ్యపడదో వాటికి ఆన్‌లైన్ కోచింగ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 200 మంది విద్యార్థులు కూర్చునే ఒక ఎయిర్ కండిషన్ క్లాస్‌రూమ్ (ఆడిటోరియం), 50 మంది కూర్చోగలిగిన మరో మూడు ఏసి క్లాస్ రూములు ఉన్నాయన్నారు.

50 కంప్యూటర్లతో కూడిన రెండు డిజిటల్ లైబ్రరీలు విద్యార్థుల సౌకర్యార్థం ఏర్పాటు చేశామన్నారు. హై స్పీడ్, అన్ లిమిటెడ్ డాటా కలిగిన ఇంటర్నెట్ సౌకర్యం స్టడీ సర్కిల్ ఆవరణలో అందుబాటులో ఉందన్నారు. దాదాపు 12వేలకు పైగా పుస్తకాలు కలిగిన లైబ్రరీలో ప్రతి విద్యార్థి కోసం ఒక క్యుబికల్ ఉంటుందని, అన్ని ముఖ్యమైన తెలుగు ఇంగ్లీషు వార్తాపత్రికలు, మ్యాగజైన్లు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

విద్యార్థులకు పుస్తకాల కొనుగోలుకు రూ. 10 వేలు ఇస్తున్నట్లు , నెలనెలా పాకెట్ మనీ, వైద్యం, ఔషధాల కొనుగోలు కోసం తగిన డబ్బులు చెల్లించబడతాయని, పురుషులకు, మహిళలకు వేరువేరు హాస్టళ్ళు ఉన్నాయని, విద్యార్థుల స్వయం నిర్వహణలోని మెస్ ద్వారా చక్కని పౌష్టికాహారం అందిస్తున్నామని పేర్కొన్నారు. 75 శాతం సీట్లు షెడ్యూల్ కులాల వారికి కేటాయించబడగా, 15 శాతం సీట్లు వెనుక బడిన తరగతుల వారికి, 10 శాతం సీట్లు షెడ్యూల్ తెగల వారికి కేటాయించినట్లు వెల్లడించారు.

గత ఏడాదిలో 250 మంది కోచింగ్ పొందగా, 18 మంది ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులై మెయిన్స్ పరీక్ష రాసారని, అందులో ముగ్గురు ఇంటర్వ్యూ కు ఎంపిక అయి ఢిల్లీకి వెళితే ఒకరికి 885 వ ర్యాంకు వచ్చిందని ఐఆర్‌ఎస్ పోస్టు వచ్చే అవకాశం ఉందన్నారు. సివిల్ సర్వీసెస్ ఆశావహులైన పట్టభద్రులు, రాష్ట్ర స్టడీసర్కిల్‌లో ప్రవేశం పొందేందుకు ఈ అవకాశం వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉండాలని, ప్రవేశపరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News