మస్కట్ : ఆధునిక అరబ్ ప్రపంచంలో సుదీర్ఘ పాలకునిగా ప్రసిద్ధి కాంచిన ఒమన్సుల్తాన్ ఖబూస్ బిన్ (79) శుక్రవారం కన్నుమూశారు. పెద్దపేగు క్యాన్సర్తో ఆయన గత కొంతకాలంగా బాధపడుతున్నారు. 1970 నుంచి తండ్రి నుంచి వారసత్వంగా లభించిన సుల్తాన్ పదవిలో ఇంత కాలం ఆయన కొనసాగారు. అవివాహితుడైనందున ఆయనకు పిల్లలు లేరు. అలాగే తోబుట్టువులైన సోదరులు లేరు. ఇప్పుడు ఆయన తరువాత ఎవరు సుల్తాను అవుతారో ఇంకా తెలియడం లేదు. ఒమన్ రాజ్యాంగం ప్రకారం మూడు రోజుల్లో సుల్తాన్ వారసుడిని ఎన్నుకోవాల్సి ఉంది. ఆ రాజకుటుంబం ఎవరి పేరైనా సూచించినా లేకుంటే ఖబూస్ రాజకుటుంబాన్ని ఉద్దేశిస్తు రాసిన లేఖలో ఎవరి పేరైనా సూచించినా ఆ వ్యక్తికే సుల్తాన్ పదవి దక్కుతుంది. సుల్తాన్ పదవికి అభ్యర్థి ఒమన్ ముస్లిం తల్లిదండ్రులు కలిగిన , రాజకుటుంబానికి చెందిన వాడై ఉండాలి.
అయితే ఈ పదవికి 80 మంది పోటీ పడుతున్నారని తెలిసింది. వీరందరిలో 65 ఏళ్ల అసద్ బిన్ తారిఖ్ పేరు వినిపిస్తోంది. తారిఖ్ 2017లో అంతర్జాతీయ సంబంధాలు, సహకార వ్యవహారాల డిప్యూటీ ప్రధానిగా నియామకమయ్యారు. 2002 నుంచి సుల్తాన్ దగ్గరి బంధువుగా, ప్రత్యేక ప్రతినిధిగా ఆయనకు మద్దతు లభిస్తోంది. ఖబూస్ అరబ్ దేశాన్ని ఆధునిక దిశగా నడిపించడంలో చురుకుగా వ్యవహరించారు. ఆరు దేశాలతో ఇరాన్కు కుదిరిన అణు ఒప్పందంలో ఖబూస్ నేతృత్వం లో ఒమన్ మధ్యవర్తిగా వ్యవహరించడంతో గల్ఫ్ దేశాల్లో ఒమన్ ప్రాధాన్యత పెరిగింది.
Oman Sultan Qaboos Bin Passed Away