Friday, April 19, 2024

ఐపిఎల్‌ ఆరంభ వేడుకల్లో ధోనీ పాదాలు తాకిన స్టార్‌ సింగర్‌

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపిఎల్) 16వ సీజన్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. కరోనా కారణంగా గత మూడేండ్లుగా ఎలాంటి ఆర్భాటాలు లేకుండానే సాగుతున్న ఐపిఎల్ ఈసారి తారల తలుకుబెలుకులు, మిరుమిట్లుగొలిపే పటాకుల వెలుగులు, చెవులు మోతెక్కే మ్యూజిక్‌ షో.. ఆకాశంలో అద్భుతాన్ని ఆవిష్కరించిన డ్రోన్‌ షోతో ఈ మెగా లీగ్‌కు అంకురార్పణ జరిగింది. మ్యాచ్‌ ఆరంభానికి ముందు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు అభిమానులను కట్టిపడేశాయి. ప్రపంచంలోనే అతిపెద్దదైన అహ్మదాబాద్‌ స్టేడియంలో లక్ష మందికి పైగా ప్రేక్షకుల సమక్షంలో మ్యూజిక్ కార్యక్రమం ఆహుతులను ఆకట్టుకుంది.

బాలీవుడ్‌ స్టార్‌ సింగర్‌ అర్జిత్‌ సింగ్‌ మ్యూజిక్‌ షోతో ప్రారంభమైన ఆరంభ వేడుకల్లో సినీ తారాలు తమన్నా భాటియా , రష్మిక మందన సందడి చేశారు. పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా మామా’ పాటకు తమన్నా అదిరే స్టెప్పులు వేయగా, సూపర్‌హిట్‌ మూపీ పుష్పలోని ‘సామీ సామీ’ పాటకు రష్మిక మందన కాలుకదిపింది. తన ట్రేడ్‌ మార్క్‌ స్టెప్‌లతో స్టేడియాన్ని హోరెత్తించింది. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం బిసిసిఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, కార్యదర్శి జై షా, కోశాధికారి అరుణ్‌ ధూమల్‌తో పాటు చెన్నై, గుజరాత్‌ కెప్టెన్లు ధోనీ, హార్దిక్‌ పాండ్యా ఐపిఎల్‌ ట్రోఫీతో ఫొటోలకు ఫోజులిచ్చారు.

ఈ సందర్భంగా స్టార్‌ సింగర్‌ అర్జిత్‌ సింగ్‌ చెన్నై కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ  పాదాలు తాకాడు. అర్జిత్‌ హఠాత్తుగా ఇలా చేయడంతో ఆయనను వారించడానికి ధోనీ ప్రయత్నించాడు. ఆయన్ని పైకితీసుకుని ఆలింగనం చేసుకున్నాడు. ఆ సమయంలో తమన్నతోపాటు రష్మిక కూడా వేదికపైనే ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాలను ఊపేస్తున్నది. అర్జిత్‌.. ధోనీ కాళ్లు మొక్కడంపట్ల ఒక్కొక్కరు ఒక్కోవిధంగా స్పందిస్తున్నారు. ‘ఫొటో ఆఫ్‌ ద డే’ అని ఒక అభిమాని అనగా, ‘బెస్ట్‌ పిక్చర్‌ ఆన్‌ ఇంటర్‌నెట్‌ టుడే’ అని మరొకరు పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News