Friday, April 19, 2024

కోటి పది లక్షల ఫాస్టాగ్‌ల విక్రయం

- Advertisement -
- Advertisement -

 Fastag

 

నేటి నుంచి తప్పనిసరి
జరిమానా తప్పదు

హైదరాబాద్ : జాతీయ రహదారులపై వెళ్లే వాహనదారులకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఎఐ) శుభవార్త చెప్పింది. టోల్‌ప్లాజాల దగ్గర ఫాస్ట్ ట్యాగ్‌లు సరిగ్గా పనిచేయకపోతే వాహన చోదకులు టోల్‌ఫీజు చెల్లించకుండా ఫ్రీగా వెళ్లిపోవచ్చని ప్రకటించింది. జనవరి 15 తర్వాత జాతీయ రహదారులపై ప్రయాణించాలి అంటే తప్పనిసరిగా ఫాస్ట్ ట్యాగ్ ఉండాల్సిందే కానీ.. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఫాస్ట్‌ట్యాగ్‌ను నమ్ముకుంటే టెక్నికల్ సమస్యల వల్ల ప్రయాణం తలకు మించిన భారమవుతోంది. దీంతో ఎన్‌హెచ్‌ఎఐ ఫాస్ట్ ట్యాగ్ యంత్రాలు పనిచేయని పక్షంలో ఉచితంగా వెళ్లేందుకు అనువుగా రూల్స్ సవరించింది. అయితే మీ వెహికల్ ఫాస్ట్ ట్యాగ్ ఖాతాలో బ్యాలెన్స్ ఉండాలి. అది సక్రమంగా పనిచేస్తూ ఉండేలా జాగ్రత్త పడాలి. అప్పుడే ఉచిత ట్రిప్‌కు అనుమతి ఉంటుంది.

క్యూలో ఆగిపోకుండా వాహన చోదకులు సమయాన్ని ఫాస్ట్ ట్యాగ్ కాపాడుతుంది. అంతేకాదు టోల్ దాటిన ప్రతి వాహనం స్కాన్ అవుతుండటంచే క్రైమ్స్ విషయంలో కూడా నేరస్తులను పట్టుకోవడం సులభతరమవుతుంది. ఫాస్ట్‌ట్యాగ్‌లను 22 సర్టిఫైడ్ బ్యాంకుల ద్వారా పొందవచ్చు. టోల్‌ప్లాజాల్లోనూ తీసుకునే సదుపాయం ఉంది. ఇటీవల వాటిని అమేజాన్ వంటి ఇ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్‌లలో కూడా అందుబాటులోకి తెచ్చారు. కస్టమర్లకు ఫాస్ట్ ట్యాగ్ సులభతరం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్పేస్(యుపిఐ) కార్డులు, నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు జారీ చేసిన ప్రీపెయిడ్ కార్డుల ద్వారా కూడా టోల్ చెల్లింపులు జరపొచ్చని తెలిపింది. కాగా, ఇప్పటికే కోటి పది లక్షల ఫాస్ట్ ట్యాగ్‌లు జారీ చేసినట్లుగా ఎన్‌హెచ్‌ఎఐ నుంచి సమాచారం అందుతోంది. మరో వైపు వాహనానికి ఫాస్ట్ ట్యాగ్ లేనివాళ్లు జరిమానాలు చెల్లించక తప్పదు.

వాహన చోదకులకు ఊరట…
ఫాస్టాగ్ ఉన్నా ప్రయోజనం ఏమీ కనిపించడం లేదని టోల్ ప్లాజాల వద్ద వాహన చోదకులు గత నాలుగైదు రోజులుగా టోల్‌ప్లాజా అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. తాజాగా ఎన్‌హెచ్‌ఎఐ తీసుకున్న నిర్ణయం వారికి ఊరటని కలిగించింది. సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని పట్నవాసులు పల్లెబాట పట్టారు. ట్రైన్‌కి వెళ్లిన వారి సంగతి అటుంచితే.. రోడ్డు మార్గాన వెళ్లిన వారు ట్రాఫిక్ వల్ల చుక్కలు చూశారు. టోల్‌ప్లాజాల వద్ద గంటల కొద్ది సమయం వెచ్చించాల్సి వచ్చింది. మరోవైపు ఫాస్టాగ్ సరిగ్గా రీడ్ కాక వాహనదారలు తెగ తిప్పలు పడ్డారు. ప్రధానంగా హైదరాబాద్‌విజయవాడ జాతీయ రహదారిపై గత రెండు, మూడ్రోజులుగా ఆయా టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. పండుగ సమయంలోనైనా టోల్ ఫీజును ఎత్తేయాలని వాహన చోదకులు డిమాండ్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఫాస్టాగ్ కలిగిన వారు ఉచితంగా ఆయా టోల్‌ప్లాజాలను దాటేయొచ్చన్న ప్రకటన ఆయా వాహన చోదకులకు ఊరటనిచ్చిందనే చెప్పవచ్చు.

నేటి నుంచి ఫాస్టాగ్ కంపల్సరీ…
ఇదిలా ఉండగా నేటి నుంచి ఫాస్టాగ్ విధానం పూర్తిస్థాయిలో అమలులోకి వస్తుందని అధికారులు ప్రకటించారు. తొలుత డిసెంబర్ 1న ఫాస్టాగ్ విధానం అమలులోకి తెద్దామని భావించారు. అది వీలుపడలేదు. ఆ తర్వాత డిసెంబర్ 15 నుంచి అమలు చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. అయితే ఫాస్టాగ్‌లపై సరైన అవగాహన కలిగించకపోవడంతో మరల జనవరి 15 వరకు ఫాస్టాగ్‌లు తీసుకునేందుకు అవకాశం కల్పించారు. అందుకు అనువుగా ఫాస్టాగ్‌లేని వాహనదారులు ఫాస్టాగ్‌లు పొందేందుకు ఆయా టోల్‌ప్లాజాల వద్ద 25 శాతం గల లైన్లను ఏర్పాటు చేశారు. అయితే మధ్యలో ఫాస్టాగ్ కార్డుల కొరత ఏర్పడటం ఇత్యాది పరిణామాలు చోటు చేసుకున్నాయి.

మరోవైపు ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఫాస్టాగ్‌లు సాంకేతిక సమస్యల వల్ల పనిచేయకపోవడం ఇత్యాది అంశాలు కొంత గందరగోళ పరిస్థితులకు తావిచ్చాయి. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఫాస్టాగ్‌లు కలిగిన వారు ఎలాంటి ఫీ చెల్లించకుండానే నేరుగా టోల్‌ప్లాజాలను దాటేయ్యొచ్చు. పండుగ పర్వదినం సందర్భంగా వాహనచోదకులు పడుతున్న ఇక్కట్లను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈ నిర్ణయం తీసుకుని ఉండి ఉండవచ్చని భావించొచ్చు. కాగా, ఫాస్టాగ్ విధానం అమలులో సమస్యలు తలెత్తని రీతిలో ముందస్తుగానే చర్యలు తీసుకుని ఉండి ఉంటే ఇటువంటి ఇక్కట్లు వచ్చేవి కాదన్నవి కొందరు వాహనచోదకులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అయితే తాజా ప్రకటనతో ఆయా టోల్‌ప్లాజాల వద్ద మునుపటి రద్దీ, ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉంది.

Penalties for those who don’t have Fastag
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News