Thursday, May 2, 2024

వింత కాపురం: రైలు పట్టాలపైనే వంటలూ, చదువులూ! (వీడియో)

- Advertisement -
- Advertisement -

కాదేదీ కవితకు అనర్హం అని శ్రీశ్రీ అన్నాడు… కానీ కాదేదీ వంటలకూ, చదువులకూ అనర్హం అని ముంబయి వాసుల్ని చూస్తే అనిపిస్తుంది. ముంబయిలోని మహీమ్ జంక్షన్ రైల్వే స్టేషన్ లో కొందరు పట్టాలపైనే వంటలు చేసుకుంటున్నారు. తిని హాయిగా పట్టాలపైనే పడుకుంటున్నారు. వారి పిల్లలు పుస్తకాలు చేతబట్టి, పట్టాలపైనే చదువుకుంటున్నారు కూడా. కొందరు బాధ్యత గల పౌరులు దీన్ని వీడియో తీసి, ఎక్స్ లో పోస్ట్ చేయడంతో అది చూసిన నెటిజన్లు విస్తుపోతున్నారు. ‘ఇదేంటి, ఇదేం పని? అది ఎంత ప్రమాదమో తెలియదా వారికి?’ అని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తుంటే, ఇంకొందరు రైల్వే అధికారుల నిర్లక్ష్యాన్ని, బాధ్యతారాహిత్యాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు.

ముంబయి శివార్లలోని మహీమ్ జంక్షన్ లో కొందరు మహిళలు రైలు పట్టాల మధ్యనే వంటలు చేసుకుంటున్నారు. వారి పిల్లలు అక్కడే పట్టాల మధ్య పరుగులు పెడుతూ ఆడుకుంటున్నారు. ఇంకొందరు పిల్లలు అక్కడే చదువుకుంటున్నారు. కొందరు పెద్దవాళ్లు పట్టాల మధ్య పడుకుంటున్నారు. ఈ సంఘటనలను వీడియో తీసి ‘మహీమ్ జంక్షన్ పట్టాల మధ్య’ అనే శీర్షికతో ఒక నెటిజన్ బుధవారం చేసిన పోస్ట్, వైరల్ గా మారింది. దీంతో సెంట్రల్ రైల్వేకు చెందిన డివిజనల్ రైల్వే మేనేజర్ రంగంలోకి దిగారు. పట్టాల మధ్య కాపురం పెట్టిన ఆ కుటుంబాలను వెంటనే అక్కడినుంచి తప్పించాలంటూ ముంబయి సెంట్రల్ డివిజన్ కు చెందిన రైల్వే పోలీసులను ఆదేశించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News