మనతెలంగాణ/హైదరాబాద్ : పచ్చని మొక్కలు నాటి పుడమికి బహుమతిగా ఇవ్వాలని రాష్ట్రంలోని మొదటి మహిళ పైలెట్ సంజన చెప్పారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా సింగర్ మధుప్రియ, చిలుకానగర్ కార్పొరేటర్ గోపు సరస్వతి విసిరిన ఛాలెంజ్ను స్వీకరించి శనివారం మహిళా పైలెట్ సంజన, సినీనటుడు మధు మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో సంజనతో పాటు కార్పొరేటర్ గోపు సరస్వతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పైలెట్ సంజన మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. పచ్చని మొక్కలు నాటి పుడమికి బహుమతిగా ఇచ్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. మొక్కలు నాటి వాటిని కాపాడేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆమె కోరారు. వాతావరణ సమతుల్యానికి పచ్చని ప్రకృతి ఎంతో అవసరమని చెప్పారు.
వాతావరణ సమతుల్యాన్ని కాపాడాలి
శానసభ కార్యదర్శి వి.నరసింహాచార్యులు
వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు 33 శాతం పచ్చదనాన్ని పెంపొందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని శాసనసభ కార్యదర్శి వి. నరసింహాచార్యులు చెప్పారు. సైబరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీసు వి.సి సజ్జనార్ మొక్కలు నాటి విసిరిన ఛాలెంజ్ని స్వీకరించిన నర్సింహాచార్యులు శాసనసభ ప్రాంగణంలో మూడు మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగం నర్సింహాచార్యులు ముగ్గురిని నామినేట్ చేశారు. ఇందులో శాసన పరిషత్ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, శాసనసభ ఉప సభాపతి పద్మారావు గౌడ్, శాసన మండలి చీఫ్విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు ఉన్నారు. ఈ సందర్భంగా నర్సింహాచార్యులు మాట్లాడుతూ ఎంపి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో పోలీసు కమిషనర్ సజ్జనార్ తనను నామినేట్ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో 33 శాతం పచ్చదనాన్ని పెంపొందించేందుకు సిఎం కెసిఆర్ చేస్తున్న కృషిని ప్రజలంతా ప్రశంసిస్తున్నారని చెప్పారు.