బ్రిస్బేన్ : ప్రతిష్టాత్మకమైన బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్లో చెక్ స్టార్, రెండో సీడ్ కరోలినా ప్లిస్కోవా ఫైనల్కు చేరుకుంది. అమెరికాకు చెందిన 8వ సీడ్ మాడిసన్ కీస్ కూడా సెమీఫైనల్ పోరులో విజయం సాధించి టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్లిస్కోవా మూడో సీడ్ నవోమి ఒసాకా (జపాన్)ను ఓడించింది. నువ్వానేనా అన్నట్టు సాగిన పోరులో ప్లిస్కోవా 67, 76, 62తో ఒసాకాను కంగుతినిపించింది. ఆరంభం నుంచే పోరు నువ్వానేనా అన్నట్టు కొనసాగింది.
ఇద్దరు కూడా ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు. దీంతో పోరు యుద్ధాన్ని తలపించింది. ఆరంభ సెట్లో ఒసాకా అద్భుతంగా ఆడింది. ఒత్తిడిని సయితం తట్టుకుంటూ ముందుకు సాగింది. టైబ్రేకర్ వరకు వెళ్లిన పోరులో విజయాన్ని అందుకుంది. రెండో సెట్లో కూడా ఒసాకా అద్భుత పోరాట పటిమను కనబరిచింది. కానీ, కీలక సమయంలో ఒత్తిడికి గురైంది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమైన ప్లిస్కోవా సెట్ను గెలుచుకుంది. ఇక, ఫలితాన్ని తేల్చే మూడో సెట్లో ఒసాకా పూర్తిగా చేతులెత్తేసింది. ప్రత్యర్థి కనీస పోటీ కూడా ఇవ్వకుండానే ఓటమి పాలైంది. మరో సెమీస్లో మాడిసన్ కీస్ 36, 62, 63తో చెక్కు చెందిన ఐదో సీడ్ పెట్రా క్విటోవాను ఓడించింది. ఆసక్తికరంగా సాగిన పోరులో చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న కీస్ విజయాన్ని అందుకుంది.
Pliskova saves match point