Friday, April 26, 2024

డాక్యుమెంటరీపై మోడీ మౌనం!

- Advertisement -
- Advertisement -

కొన్ని అంశాలను ఎంతగా మూసి పెట్టాలని చూసినా సాధ్యంకాదు. తమకు హానికరం కాదు అనుకున్న అనేక నివేదికలను పశ్చిమ దేశాలు వెల్లడిస్తుంటాయి. వాటిని చూసి మన దేశం లో కూడా అనేక మంది పాత సంగతులను అలాగే ఎందుకు వెల్లడించకూడదు అనుకుంటారు. గోద్రా రైలు దుర్ఘటన పేరుతో జరిపిన 2002 గుజరాత్ మారణకాండ గురించి బ్రిటన్ రాయబారి తమ ప్రభుత్వానికి పంపిన నివేదికల్లోని అంశాలను బహిర్గతం చేస్తే కొంత మంది ఇప్పుడు ధూం ధాం అంటూ మండిపడుతున్నారు. తమ రాయబారి పంపిన అంశాలను బ్రిటన్ సరికొత్త పద్ధతుల్లో వెల్లడికావించింది.

బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బిబిసి) రెండవ ఛానల్ ‘భారత్ : మోడీ వివాదం (ఇండియా : ద మోడీ క్వొశ్చన్) పేరుతో 2023 జనవరి 17న ప్రసారం చేసిన పరిశోధనాత్మక డాక్యుమెంటరీ తొలి భాగం ఆ దురంతాలను గుర్తుకు తెచ్చి మరోసారి నరేంద్ర మోడీ, సంఘపరివార్ సంస్థల పేర్లను జనం నోళ్లలో నానేట్లు చేసింది. బిబిసికి సమాచారం ఇచ్చిన తీరు మీద బ్రిటన్ ప్రభుత్వాన్ని ఖండించలేని నిస్సహాయ స్థితికి ప్రపంచంలో ఎదురులేదని చెబుతున్న నరేంద్ర మోడీని నెట్టింది. ప్రతిస్పందిస్తే మరింత పరువుపోతుంది అన్నట్లుగా మాట్లాడకూడదని నిర్ణయించింది. పైకి మాట్లాడినా మాట్లాడకున్నా ప్రపంచమంతా మోడీ గురించి మరోసారి అవలోకిస్తుంది.

ఈ డాక్యుమెంటరీ వక్రీకరణలతో ప్రచారం కోసం నిర్మించిందని, ఒకనిర్దిష్టమైన పరువు తక్కువ కథనాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు రూపొందించినదని, దాని మీద ఇంతకుమించి స్పందించి గౌరవించదగినది కాదని విదేశాంగశాఖ ప్రతినిధి అరిందవ్‌ు బాగ్చీపేర్కొన్నారు. సమాధానం చెప్పాల్సిన అవసరంలేదని అన్నారు. వివాదం తలెత్తటంతో ఈ డాక్యుమెంటరీని యూ ట్యూబ్ నుంచి తొలగించారు.ఈ నెల 24న మరొక భాగం ప్రసారం కావాల్సి ఉంది. తమ కథనాన్ని బిబిసి సమర్ధించుకుంది. ఉన్నతమైన సంపాదక ప్రమాణాలకు అనుగుణంగా తీవ్రంగా పరిశోధించిన తరువాత రూపొందించినట్లు పేర్కొన్నది. భిన్న గళాలు, అభిప్రాయాలు వెలిబుచ్చే వారిని, నిపుణులను తాము కలిశామని, బిజెపికి చెందిన వారి స్పందనలతో సహా పలు అభిప్రాయాలకు దానిలో తావిచ్చామని, తమ డాక్యుమెంటరీలో లేవనెత్తిన అంశాలకు తగిన సమాధానం ఇవ్వాలని భారత ప్రభుత్వాన్ని కోరగా స్పందించేందుకు తిరస్కరించినట్లు బిబిసి తన ప్రకటనలో పేర్కొన్నది.

గుజరాత్ ఉదంతాలు, నరేంద్రమోడీ పాత్ర గురించి ఒక చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు అది ప్రసారంగాక ముందే కేంద్ర ప్రభుత్వానికి తెలుసు అని బిబిసి ప్రకటన చెబుతున్నది. చర్చ మరింత జరిగితే నరేంద్ర మోడీ, బిజెపికి మరింత నష్టం గనుక కేంద్రం నుంచి లేదా బిజెపి దీని గురించి ముందు ముందు ప్రస్తావించకపోవచ్చు. మొత్తంగా మీడియా నరేంద్ర మోడీకి అనుకూలంగా ఉన్నప్పటికీ పరిమితంగానైనా వార్తలు ఇవ్వకపోవచ్చు, చర్చలుజరపకపోవచ్చు. డాక్యుమెంటరీలో పేర్కొన్నదాని ప్రకారం నాటి బ్రిటన్ దౌత్యవేత్త పంపిన సమాచారపత్రానికి పెట్టిన శీర్షిక, సంగ్రహం ఇలా ఉంది. ‘విషయం: గుజరాత్ మారణకాండ’ వెల్లడైనదాని కంటే హింస చాలా ఎక్కువగా ఉంది. కనీసం రెండు వేల మంది మరణించారు.

పథకం ప్రకారం పెద్ద ఎత్తున ముస్లిం మహిళల మీద అత్యాచారాలు జరిగాయి. లక్షా 38వేల మంది నిరాశ్రయులయ్యారు. హిందువులు ఉండే చోట, హిందువులు ముస్లింలు కలసి ఉన్న ప్రాంతాలలో ముస్లింల వ్యాపారాలను లక్ష్యంగా చేసుకొని విధ్వం సం కావించారు. పథకం ప్రకారం హింస జరిగింది. కొన్ని నెలల ముందుగానే పథకంవేసి ఉండవచ్చు రాజకీయ ప్రేరేపితమైనది. హిందువులుండే ప్రాంతాల నుంచి ముస్లింలను తరమివేయమే లక్ష్యం. రాష్ర్ట ప్రభుత్వ రక్షణలో దీనికి విహెచ్‌పి (హిందూ ఉగ్రవాద సంస్థ) నాయకత్వం వహించింది. మోడీ ముఖ్యమంత్రిగా ఉండగా ఐకమత్యం అసాధ్యం. వారి(హిందూ మూకలు) పథకం ప్రకారం సాగించిన హింసలో నిర్దిష్ట జాతి నిర్మూలన లక్షణాలన్నీ ఉన్నాయి. శిక్షలేమీ ఉండవనే వాతావరణాన్ని రాష్ర్ట ప్రభుత్వం కల్పించకుండా విహెచ్‌పి అంత ఎక్కువ నష్టం కలిగించి ఉండేది కాదు. దీనికి నరేంద్ర మోడీ నేరుగా బాధ్యుడు.’ ఇంతేకాదు, డాక్యుమెంటరీ వెల్లడించిన దాని ప్రకారం బ్రిటన్‌తో పాటు ఐరోపా సమాఖ్య కూడా విచారణ జరిపింది. వాటిసారం ఒక్కటే. హింసాకాండలో మంత్రులు చురుకుగా భాగస్వాములయ్యారు. దాడుల్లో జోక్యం చేసుకోవద్దని సీనియర్ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

విశ్వసనీయమైన వారు చెప్పినదాని ప్రకారం 2002 ఫిబ్రవరి 27న నరేంద్ర మోడీ సీనియర్ పోలీసు అధికారులతో సమావేశమై జోక్యం చేసుకోవద్దని ఆదేశించారు. అసలు అలాంటి సమావేశం జరగలేదని పోలీసు అధికారి ఒకరు చెప్పినట్లు కూడా బిబిసి తన కథనంలో పేర్కొన్నది. సమావేశం జరిగిందని అంగీకరిస్తే మోడీ ఆదేశాలను అమలు జరిపినట్లుగా అంగీకరించినట్లవుతుంది. ఆ ఉదంతాలకు స్వయంగా కారకులని అంగీకరించినట్లవుతుంది కనుక అసలు సమావేశమే జరగలేదని చెప్పినట్లు కూడా పేర్కొన్నది. నాడు ఇంటలిజెన్స్ విభాగ అధిపతిగా ఉన్న ఆర్‌బి శ్రీకుమార్, మరో అధికారి సంజీవ భట్, మరో అధికారి మాత్రం నరేంద్ర మోడీ ఆదేశాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. సదరు సమావేశంలో అసలు వారెవరూ పాల్గొనలేదని అదే కథనంలో మరొక పోలీసు అధికారి చెప్పిన అంశాన్ని కూడా డాక్యుమెంటరీలో పేర్కొన్నారు. మరొక కేసులో సంజీవ భట్ ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్నారు.

ఈ కథనంలో లేదా నరేంద్ర మోడీ మద్దతుదార్లు, బిజెపి ఏమి చెప్పినా కొన్ని సందేహాలకు సరైన సమాధానం రాలేదు. అంతటి తీవ్ర శాంతిభద్రతల సమస్య తలెత్తినపుడు ఏ సిఎం అయినా ఇంటలిజెన్స్ అధికారిని పిలిపించకుండా, ఉన్నతాధికారుల సమావేశం జరపకుండా, నిర్ణయాలు తీసుకోకుండా ఉంటారా?‘స్నేహపూర్వకంగా ఉన్న ఒక దేశాధినేత గురించి గతంలో బిబిసిలో అలాంటి విమర్శ వచ్చినట్లు నాకు గుర్తు లేదు. కనుక సహజంగా ఒక ప్రశ్న తలెత్తుతుంది. అదేమంటే భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని గట్టిగా కోరుకుంటూ ప్రస్తుతం బ్రిటన్ ప్రభు త్వం సున్నితమైన చర్చల్లో మునిగి ఉన్నపుడు గుజరాత్ కొట్లాటలపై విస్ఫోటకంవంటి చిత్రాన్ని ప్రసారం చేయాలని బిబిసి ఎందుకు నిర్ణయించినట్లు’ అని మన విదేశాంగశాఖ మాజీ కార్యదర్శి ఒకరు ప్రశ్నించినట్లు బిబిసి పేర్కొన్నది.

నిజమే, వాణిజ్య ఒప్పందం గురించి చర్చలు జరుపుతున్న తరుణంలో ఇలాంటి అంశాలతో కూడిన చిత్రాన్ని ప్రసారం చేస్తే హానికలిగే అవకాశం ఉంటుంది, ఇతర సంబంధాలు కూడా ప్రభావితం అవుతాయి. కనుక ఏ ప్రభుత్వమైనా తన దగ్గర ఉన్న సమాచారాన్ని, అందునా ప్రభుత్వ నిధులతో నడిచే ఒక మీడియా (బిబిసి) సంస్థకు అందచేసి బహిర్గతపరిచేందుకు అనుమతిస్తుందా? కారణం ఏదైనా బ్రిటన్ ప్రభుత్వం అందించింది, ప్రసారానికి కూడా అనుమతి ఇచ్చింది. గుజరాత్ మారణకాండ జరిగినపుడు బ్రిటన్ విదేశాంగ మంత్రిగా ఉన్న జాక్ స్ట్రా ఆ ఉదంతాలపై నివేదిక ఇవ్వాలని కోరాడు. హోంమంత్రిగా జాక్ స్ట్రా పని చేసినపుడు బ్రిటన్ సమాచార స్వేచ్చ చట్టాన్ని 2000లోతెచ్చారు. దాన్ని సమీక్షించేందుకు 2015లో ఏర్పాటు చేసిన ఒక కమిటీలో కూడా జాక్ ఉన్నాడు. బహుశా సమాచార కమిషన్‌తో ఉన్న దగ్గరి సంబంధాల కారణం గా గుజరాత్ నివేదికలను బహిర్గతం కావించేందుకు అతగాడు ఒక పాత్ర పోషించి ఉండవచ్చని భావిస్తున్నారు.

జాక్ స్ట్రా లేబర్ పార్టీ నేత కనుక టోరీ పార్టీ ప్రధాని రిషి సునాక్‌ను ఇబ్బందుల్లోకి నెట్టేందుకు చూసి ఉండవచ్చు అనుకుంటే, అధికారంలో ఉన్న పార్టీ, మంత్రులు, అధికారులు ఎందుకు సహకరించినట్లు అన్న ప్రశ్న వెంటనే వస్తుంది. రాయబార కార్యాలయం పంపిన నివేదికలో నరేంద్ర మోడీ పాత్ర గురించి స్పష్టంగా చెప్పిన కారణంగానే ఆ తరువాత బ్రిటీష్ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించింది. బ్రిటన్‌లోని హిందూత్వ సంస్థల ఆహ్వానం మేరకు 2003లో నరేంద్రమోడీ అక్కడికి వెళ్లారు. దాని మీద తలెత్తిన విమర్శలతో ‘నరేంద్రమోడీ బ్రిటన్ సందర్శన గురించి మాకు తెలుసు, ప్రభుత్వ ఆహ్వానం మేరకు అతను రావటం లేదు, ఇక్కడ ఉన్నపుడు అతనితో ఎలాంటి సంబంధాలూ ఉండవు’ అని బ్రిటన్ సర్కార్ ప్రకటించింది. మోడీ బ్రిటన్ వెళ్లినపుడు భారత డిప్యూటీ హైకమిషనర్‌గా ఉన్న సత్యవ్రత పాల్ తరువాత రాసిన దానిలో ఇలా ఉంది.

‘విదేశాంగశాఖ మంత్రి (యశ్వంత సిన్హా) ప్రధాని వాజ్‌పాయి దగ్గరకు వెళ్లారు. ఆ పర్యటన వాంఛనీయం కాదు, రద్దు చేసుకోవాల్సిందే అన్న వైఖరితో ప్రధాని కూడా అంగీకరించారు.” అయినా సరే జరిగింది అంటే సంఘపరివార్ వత్తిడి కారణం అన్నది స్పష్టం. ఇక మోడీ బ్రిటన్‌లో ఉండగా ఇమ్రాన్ ఖాన్ అనే లాయరు మోడీని అరెస్టు చేయాలని అక్కడ కోర్టుకు వెళ్లారు, కోర్టు అంగీకరించలేదు. ఇప్పుడు బిబిసి వెల్లడించిన సమాచారం గనుక ఆనాడు తన వద్ద ఉండి ఉంటే మోడీ అరెస్టుకు దారితీసేదని ఇమ్రాన్ ఖాన్ అన్నాడు. అదే సర్కార్ తరువాత 2005లో మోడీ వీసాను రద్దు చేసింది. అమెరికా కూడా వీసాను రద్దు చేసింది. సిఎంగా ఉన్నపుడు మోడీ రాకను అడ్డుకుంది. తరువాత 2014 లో నరేంద్ర మోడీ ప్రధాని కాగానే ఈ రెండు దేశాలూ వీసాను పునరుద్ధరించి దేశాధినేతగా స్వాగతం పలికాయి.

ఒక దేశంలో ఒక రాష్ట్రానికి సిఎంగా ఉండటం వేరు, ప్రధానిగా దేశాధినేతగా ఉండటం వేరు గనుక తామాపని చేశామని, ఒక్క నరేంద్ర మోడీకే కాదు సౌదీ అరేబియా రాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌కు సైతం వీసా పునరుద్ధరించామని, అది సంప్రదాయమని 2022 నవంబరులో అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. తమ ప్రాణాలకు భద్రత గురించిన భయంతో భారత్‌కు చెందిన 30 మంది డాక్యుమెంటరీలో మాట్లాడేందుకు తిరస్కరించినట్లు బిబిసిపేర్కొన్నది. భారత ప్రభుత్వం కూడా దానిలో పేర్కొన్న అంశాలపై స్పందించేందుకు నిరాకరించింది అని కూడా వెల్లడించింది. ఈ నెల 24న ప్రసారం కానున్న రెండవ భాగంలో 2019 తరువాత మోడీ సర్కార్ తీరు తెన్నుల గురించి వివరించనుంది. ఈ చిత్రం గురించి పలు కుట్ర సిద్ధాంతాలను ముందుకు తెస్తున్నారు. నిజానికి అంతర్జాతీయ ఎత్తులు జిత్తులలో భాగంగా చైనాకు వ్యతిరేకంగా అమెరికా, బ్రిటన్ ముందుకు తెచ్చిన కూటముల్లో మన దేశం చురుకుగా ఉంది.

మన మీడియా వర్ణించినట్లుగా ‘మనవాడు’ రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు తీర్పు మోడీకి క్లీన్ చిట్ ఇచ్చిన తరువాత కూడ బిబిసి ఇలాంటి చిత్రాన్ని ప్రసారం చేయటం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. నిజమే బ్రిటన్ విదేశాంగ శాఖ వద్ద ఉన్న నివేదికలను కూడా సుప్రీంకోర్టుకు సమర్పించి దాని మీద విచారణ జరిగిన తరువాత బిబిసి ఆపని చేసి ఉంటే ఆ వాదనకు అర్ధం ఉంది. అలా జరగలేదే. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నరేంద్ర మోడీని బదనాం చేసేందుకు ఇలా చేశారని చెబుతున్నారు. బ్రిటన్ను ప్రభావితం చేసే స్థితిలో ఇప్పుడు అమెరికా తప్ప మరొక దేశం లేదు. అదే వాస్తవమైతే ఆ పని 2014, 2019 ఎన్నికలపుడే చేసి ఉండవచ్చు. దాని వలన బిబిసికి, బ్రిటన్ ప్రభుత్వానికి కలిగే లబ్ధి ఏమిటి?.

   ఎం కోటేశ్వరరావు, 8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News