Thursday, May 2, 2024

వృద్ద దంపతుల హత్య కేసును చేధించిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

బాన్సువాడ:బీర్కూర్ మండలంలోని రైతునగర్ ఈ నెల 25న రాత్రి జరిగిన వృద్ద దంపతుల హత్య కేసును పోలీసులు చేధించారు. శనివారం కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. అన్ని కోణాల్లో పరిశీలించి దర్యాప్తు వేగవంతం చేసి కేసును చేధించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. ఇద్దరు వ్యక్తులు బీర్కూర్ గ్రామంలో బంగారు దుకాణాల వద్ద అనుమానస్పదంగా తిరుగుతున్నారనే సమాచారం మేరకు వారిని పట్టుకుని విచారించగా, పూర్తి వివరాలు వెల్లడయ్యాయన్నారు. చెడు అలవాటు, దురలవాట్లకు బానిసై బాకీలు చేసి మోటార్ సైకిల్ కూడా కుదవపెట్టి డబ్బులు లేనందనున దొంగతనాలు చేసేందుకు పూనుకున్నారన్నారు.

పేకాట ఆడి డబ్బులు పోగొట్టుకున్నారని, రైతునగర్ గ్రామంలో దారం నారాయణ సేట్ కిరాణ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడని, అతని భార్యతో కలిసి గత కొన్నేళ్లుగా రైతునగర్‌లో కిరాణ దుకాణం నడుపుతున్నాడన్నారు. 25న రాత్రి ఇంటి వెనుకాల భాగంలో నుంచి చిన్న పాటి ఎత్తులో గల గోడపై నుంచి ఇంట్లోకి చొరబడి వృద్ద దంపతులను హత్య చేశారన్నారు. ఎర్రొల్ల నవీన్, బంగ్లా చింటు అలియాస్ చరణ్, బంగ్లా లక్ష్మణ్‌లను అరెస్టు, రిమాండ్‌కు తరలించామన్నారు. ఎర్రోల్ల నవీన్, బంగ్లా చింటులు ఈ హత్యకు పాల్పడ్డారని, బంగారు గొలుసును దొంగిలించి, బంగ్లా చింటు తండ్రి లక్ష్మణ్‌కు అందజేశారన్నారు. గొలుసు విలువ సుమారు లక్షా 50 వేలు ఉంటుందన్నారు.

హత్య కేసును చేధించిన పోలీసులను ఎస్పీ అభినందించి, రివార్డులను అందజేశారు. ఐజీ దృష్టికి తీసుకెళ్లి నగదు పారితోషకం, నజరానాల కోసం తీసుకెళ్లనున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో బాన్సువాడ డీఎస్పీ జగన్నాథ రెడ్డి, రూరల్ సిఐ మురళి, సిసిఎస్ ఎస్సై ఎండి ఉస్మాన్, ఎఎస్సై రాములు, రాజేశ్వర్, సురేందర్, వశీ, సుభాష్, సంగమేశ్వర్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News