హైదరాబాద్ : నూతన సంవత్సర వేడుకల్లో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద కేక్ కట్ చేయగా. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ మాదాపూర్లోని సైబర్ టవర్ వద్ద కేక్ కట్ చేశారు. దానితోపాటు నర్సాపూర్ ఎక్స్ రోడ్డు, జెఎన్టియూ, ఆరాంఘర్ వద్ద కూడా నూతన సంవత్సర వేడుకల కేక్ కట్ చేశారు. ఇందులో సిపి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ సిపి క్యాంప్ ఆఫీస్ సమీపంలోని అల్కాపురి కాలనీలో కేట్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన ఏడాదిలో అందరూ క్షేమంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, అనుకున్న పనులు నెరవేరాలని కోరారు. నగరంలోని నాలుగురు డిసిపిలు వారి పరిధిలో కేక్లు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
వెస్ట్ జోన్ డిసిపి ఎఆర్ శ్రీనివాస్ కెబిఆర్ పార్క్ వద్ద, సౌత్ జోన్ డిసిపి చార్మినార్ వద్ద, ఈస్ట్ జోన్ డిసిపి రమేష్ రెడ్డి మలక్పేటలో, నార్త్ జోన్ డిసిపి కల్మేశ్వర్ బేగంపేటలో కేక్ కట్ చేసి సిబ్బందికి, నగర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా మూడు కమిషనరేట్ల పోలీసులు చర్యలు తీసుకోవడంతో ఎలాంటి సంఘటనలు జరగకుండా వేడుకలు సజావుగా ముగిసాయి. కార్యక్రమంలో నగరంలో అదనపు పోలీస్ కమిషనర్ శిఖాగోయల్, అదనపు పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ అనిల్ కుమార్, జాయింట్ సిపి విశ్వప్రసాద్, ట్రాఫిక్ డిసిపి ఎల్ఎస్ చౌహాన్, టాస్క్ఫోర్స్ డిసిపి రాధాకిషన్ రావు, సైబరాబాద్లో మాదాపూర్ డిసిపి వెంకటేశ్వరరావు, ట్రాఫిక్ డిసిపి ఎస్ఎం విజయ్కుమార్, ఎడిసిపిలు సందీప్, గౌస్మోయినుద్దిన్ ఎసిపిలు ,ఇన్స్స్పెక్టర్లు పాల్గొన్నారు.
హీరో…హీరో…హీరో….
మాదాపూర్లోని సైబర్ టవర్స్ వద్ద నూతన ఏడాది కేక్ కట్ చేసేందుకు వచ్చిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్కు స్థానికులు గ్రాండ్గా స్వాగతం పలికారు. ఇటీవల దిశ నిందులను ఎన్కౌంటర్ చేయడంతో స్థానికులు సజ్జనార్ హీరో అంటూ నినాదాలు చేశారు.