Thursday, May 2, 2024

అడిగిన సమాచారం సత్వరమే అందజేయండి

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వ శాఖాధిపతులను కోరిన బిసి కమిషన్
బిసిల స్థితిగతులపై శాస్త్రీయ అధ్యయనం సాగిస్తున్న కమిషన్

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన నిర్దేశిత సూచనలమేరకు బిసిల సామాజిక స్థితి గతులను శాస్త్రీయంగా అధ్యయనం చేపట్టి, సమగ్రమైన సిఫారసులతో నివేదికను సమర్పించే దిశగా తెలంగాణ బిసి కమిషన్ తన కసరత్తును వేగవంతం చేసింది. గత 4 రోజులుగా వివిధ ప్రభుత్వ విభాగాధిపతులతో సమావేశాలు నిర్వహించింది. కమిషన్ చైర్మన్ డాక్టర్ -వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాలలో సభ్యులు సిహెచ్. శుభప్రద్ పటేల్ నూలి, కె. కిశోర్ గౌడ్, సభ్య కార్యదర్శి కె. అలోక్ కుమార్ లు పాల్గొన్నారు. కమిషన్ తన కార్యాచరణలో భాగంగా వారితో సుదీర్ఘంగా సమాలోచనలను చేపట్టింది. ఇందులో భాగంగా శనివారం ఖైరతాబాద్ లోని రాష్ట్ర బిసి కమిషన్ సమావేశ మందిరంలో బిసి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఆ శాఖకు చెందిన రెసిడెన్షియల్ పాఠశాలల సొసైటీ, వివిధ కార్పొరేషన్, ఫెడరేషన్ విభాగాల అధికారులు ఎం. చంద్రశేఖర్, మల్లయ్య భట్టు, డి. శ్రీనివాస్ రెడ్డి, సిహెచ్. విమలా దేవి, డి.ఆర్. ఉదయ్ ప్రకాష్ లతో కమీషన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యింది.

బిసి సంక్షేమ శాఖలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, రిజర్వేషన్ల అమలు, తీరుతెన్నులు, లబ్దిదారుల వివరాలు కులాల వారీగా, నిధుల కేటాయింపు, వాటి పూర్తి వివరాలు, విద్యార్థుల, ఉద్యోగుల వివరాలు, వివిధ అంశాల వారీగా సమీక్షను నిర్వహించింది. కమిషన్ అధ్యయనంలో ఏ విధంగా సహకరించాల్సి ఉంటుందో వివరంగా ఛైర్మన్ డాక్టర్ సకుళాభరణం దిశా నిర్దేశం చేశారు. ఈ నెల 25 నుండి 30 వరకు కమిషన్ పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ, పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ, హైదరాబాద్ మహానగర పాలక సంస్థ, పౌర సరఫరాల శాఖ, సెర్చ్, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ, ప్రణాళిక శాఖ, వ్యవసాయ శాఖ, పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య, ఉన్నత విద్యా మండలి, ఉపాధి, శిక్షణ, మహిళాభ్యుదయ, శిశు సంక్షేమ శాఖ, బిసి సంక్షేమ శాఖల ఉన్నత అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యింది. బిసిల విద్య, ఉద్యోగ, ఆర్ధిక, సామాజిక, రాజకీయ రంగాలలో (స్థానిక సంస్థలలో) వారి ప్రాతినిధ్యం, పొందిన అవకాశాలు, ప్రయోజనాలపై ఆయా శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని, గణాంకాలను అందజేయాలని బిసి కమిషన్ కోరింది.

కమిషన్ రూపొందించిన ‘ప్రత్యేక ఫార్మాట్‘ లను వారికి అందజేసింది. వాటిలో వివరాలను సేకరించి ఇవ్వాలని కోరింది. తులనాత్మకంగా అధ్యయనానికి వీలుగా అన్ని వివరాలను అందజేయాలని సూచించింది. వివిధ విభాగాలు సమాచారం అందించడంలో సమయ పాలన పాటించాలని, వీలైనంత త్వరగా కమిషన్ కు అందజేయాలని చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News