Sunday, April 28, 2024

అసలైన జాతి వ్యతిరేకులే భారతీయుల్ని విభజిస్తున్నారు: సోనియా గాంధీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత బిఆర్. అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నేత సోనియా గాంధీ కేంద్రంపై ధ్వజమెత్తారు. ‘రాజ్యాంగ సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది, దారి మళ్లిస్తోంది’ అని ఆమె విమర్శించారు. ఓ పద్ధతి ప్రకారం జరుగుతున్న ఈ దాడి నుంచి రాజ్యాంగాన్ని ప్రజలు కాపాడుకోవాలని ఆమె అన్నారు.

అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆమె ‘ద టెలిగ్రాఫ్’ దినపత్రికకు ఆర్టికల్ రాశారు. మతం, భాష , కులం, లింగ భేదాల ఆధారంగా ప్రజలని విభజిస్తున్నారు. అందుకు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు… వారే అసలైన ‘జాతి వ్యతిరేకులు’ అని పేర్కొన్నారు. ‘నేడు మనం అంబేడ్కర్‌ను గౌరవిస్తున్నాం. ప్రజల నడవడిక మీదే రాజ్యాంగం విజయం ఉంది. ప్రభుత్వం తన విధిని ధర్మబద్ధంగా నిర్వహించాల్సి ఉంటుంది’ అని ఆమె అన్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను నేడు దుర్వినియోగం చేస్తోంది. రాజ్యాంగ పునాదులైన స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, న్యాయంలను బలహీనపరుస్తోంది.
‘ఓ పద్ధతి ప్రకారం జరుగుతున్న దాడి నుంచి రాజ్యాంగాన్ని ప్రజలే రక్షించుకోవాలి’ అని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ అన్నారు. ప్రతి భారతీయుడు ఏ పార్టీకి చెందినా, ఏ సంఘానికి చెందినా, ఏ గ్రూప్ పౌరుడైనా సరే ఈ సంక్లిష్ట సమయంలో తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలి. డాక్టర్ అంబేడ్కర్ జీవితం, పోరాటం మనకు పాఠాలు నేర్పింది. అవే మనకు మార్గదర్శకాలు’ అని సోనియా గాంధీ అన్నారు. జాతీయ ప్రయోజనాల కోసం అందరం కలిసి పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు.లి

సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం కోసం ఎల్లప్పుడూ పోరాడాలని అంబేడ్కర్ కోరుకున్నారని సోనియా గాంధీ తెలిపారు. నేడు సామాజిక న్యాయానికి కొత్త తరహా ముప్పు ఏర్పడుతోందన్నారు. నేడు ఆర్థిక అసమానతలు కూడా బాగా పెరిగిపోయాయని ఆమె తెలిపారు. ‘ప్రభుత్వ రంగంలో బాధ్యతారాహిత్యమైన ప్రైవేటీకరణ జరుగుతోంది. తద్వారా దళితులు, ఆదివాసీలు, ఓబిసిలకు సామాజిక భద్రత, రిజర్వేషన్లు తగ్గిపోతున్నాయన్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం కారణంగా కూడా జీవితాలపై ప్రభావం పడుతోందన్నారు. అంబేద్కర్ జీవితం నేటికి భారతీయులందరికీ ప్రేరణ కావాలని సోనియా గాంధీ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News