Tuesday, April 16, 2024

జెండా వందనం ఆ రెండు పండుగలు

- Advertisement -
- Advertisement -

జణగణ మన అధినాయక.. అని గొంతెత్తి, ముక్త కంఠంతో.. జాతీయ భావాన్ని మన కంఠశోషగా త్రివర్ణం రెపరెపలకు సమున్నత గౌరవంతో సెల్యూట్‌గా.. సమర్పించాం. వీధి వీధి నా.. అధికార.. అనధికార పౌరుల సమక్షంలో.. గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకున్నాం. తల ఎత్తి.. నుదుట అరచేతితో సలాం ఓ మహోన్నత పతాకమా.. అంటూ మువ్వన్నెలకు వందనం సమర్పించాం. భరత మాతకు పాదాభివందనం అర్పించాం. త్రివర్ణ పతాకంకు.. జై హింద్ జై హింద్ అంటూ.. సమున్నత గౌరవ భావంతో.. జాతీయ గీతం ఆలకించి సెల్యూట్ సమర్పిస్తాం. స్వాతంత్య్ర దినోత్సవం నాడు జెండా ఎగరవేయడానికి, అలాగే జనవరి 26 నాడు జెండా ఆవిష్కరించడానికి తేడా ఏంటో తెలుసా.. ఆగస్టు 15, 1947న స్వేచ్ఛా వాయువులు పీల్చుతూ భారతదేశం స్వాతంత్య్రం పొందింది. అందుకే, ప్రతి ఏటా ఈ తేదీన స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ తేదీన దేశ వ్యాప్తంగా జెండా ఎగురవేసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు.

అలాగే 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమలులోకి రాగా.. ప్రతి ఏటా ఈ తేదీని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ రోజున దేశ వ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం. అయితే ఆగస్టు 15న జెండా ఎగర వేయడానికి.. జనవరి 26న జెండా ఆవిష్కరించడానికి మధ్య చిన్న తేడా ఉంది. ఆ తేడా ఏమిటో తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న దేశ ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండా ను ఎగురవేస్తారు. ఆగస్టు 15 రోజున జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. బ్రిటిష్ పాలననుంచి భారతదేశం స్వాతంత్య్రాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు.

మొదటి స్వాతంత్య్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను దింపుతూ మన దేశ జెండా ను పైకి ఎగుర వేశారు. స్వాతంత్య్రం వచ్చిందని తెలియజేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్నిపైకి లాగి ఎగురవేస్తారు. ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీకగా నిలుస్తుంది. గణతంత్ర దినోత్సవం జనవరి 26 నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని పైభాగంలో కట్టి, పైకి లాగకుండా విప్పుతారు. ఇలా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేస్తారు. ఈ రెండు తేదీలలో జెండా ను రెపరెపలాడిస్తారు. (గమనిక: ఇక్కడ జనవరి 26 నాడు జెండాను అప్పటికే కర్ర/పోల్‌కి పైన కట్టి ఉంచుతాము కనుక ఆగస్ట్ 15 లాగా జెండా ను కింది నుండి పైకి లాగము) దేశ పౌరుల ప్రతినిధి, భారత పార్లమెంటుకు ప్రజలచే నేరుగా ఎన్నికైన దేశ ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవం రోజున జండా ఎగుర వేయడానికి.. గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి ఒక కారణం ఉంది.

స్వాతంత్య్రం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమలులోకి రాలేదు. అప్పటికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు. దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీన రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి రిపబ్లిక్ డే నాడు మహోన్నత జెండాను ఆవిష్కరిస్తారు. అయితే ఇక్కడ గమనించాల్సిన వ్యత్యా సం ఏమిటంటే.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జెండాను ఎగుర వేస్తారు (Flag Hois ting). గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు (Flag Unfur ling). ఇంకొక వ్యత్యాసం ఏమిటంటే.. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల వేడుకలు రెండు వేర్వేరు ప్రదేశాల్లో జరుగుతాయి. స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్ట్ 15 నాడు జెండా ఎగురవేసే కార్యక్రమం ఎర్రకోటలో జరుగుతుంది. గణతంత్ర దినోత్సవం జనవరి 26 నాడు రాజ్‌పథ్‌లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ విషయం ఇప్పటికీ చాలా మంది ఈ దేశ పౌరులకు తెలియదు. (చదువుకున్న వాళ్లకు కూడా చాలా వరకు తెలియదు). జెండా పండుగ పై అవగాహన కల్పించడం మన బాధ్యత. ముఖ్యంగా విద్యార్దులకు తెలియాలి, తెలియజేయాలి.

మాచన రఘునందన్
9441252121

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News