Friday, May 3, 2024

నాపై అపోహలొద్దు.. నమ్మకంతో పనిచేయండి: సీనియర్లను కోరిన రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తనపై వున్న అపోహలను తీసేయాలని.. నమ్మకంతో పనిచేయాలని పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి కోరారు. పిసిసి ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ముగిసినానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తమ్‌పై వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. సొంత పార్టీ నేతలపై ఎవరైనా వ్యతిరేక పోస్టులు పెడతారా అని నిలదీశారు. కావాలనే కొందరు తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వార్ రూమ్‌కెళ్లి సునీల్ కనుగోలు టీం సభ్యులను ఎలా అరెస్ట్ చేస్తారని రేవంత్ ప్రశ్నించారు. మా పార్టీ దీన్ని చాలా సీరియస్‌గా తీసుకుందన్నారు. వార్ రూంపై దాడి చేసింది పోలీసులు కాదని, గూండాలని రేవంత్ అనుమానం వ్యక్తం చేశారు. మా డేటా అంతా ఎత్తుకెళ్లారని, తమ పార్టీ నేతలు, నిపుణులపై పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. తప్పుడు పోస్టులు పెట్టిన బిఆర్‌ఎస్ వారిపై ఎందుకు కేసు పెట్టలేదని ఆయన నిలదీశారు. భారత్ జోడో యాత్రపై సమావేశంలో చర్చించామన్నారు. హైకమాండ్ ఆదేశాలతోనే మీటింగ్ నిర్వహించామని రేవంత్ తెలిపారు. 20 నుంచి 24 వరకు అన్ని జిల్లాల్లో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు. అన్ని జిల్లాల్లో ఇన్‌ఛార్జ్‌లను నియమించామని, కొత్త కమిటీల నియామకాలతో పాత కమిటీలు రద్దు అయినట్లేనని ఆయన పేర్కొన్నారు.

అందరి అభిప్రాయాలు పరిగణనలోనికి తీసుకుని కమిటీలను ఏర్పాటు చేసినట్లు రేవంత్ చెప్పారు. 43 లక్షల సభ్యత్వాలు నమోదు చేశామని, కేంద్ర, రాష్ట్ర వైఫల్యాలను ఛార్జిషీట్ రూపంలో ప్రజలకు వివరిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ వెళ్లేలా కార్యక్రమం తీసుకుంటున్నామని.. జనవరి 3, 4 తేదీల్లో శిక్షణా తరగతులు నిర్వహిస్తామని రేవంత్ అన్నారు. హైకమాండ్ ఆదేశాల మేరకు జనవరి 26 నుంచి పాదయాత్ర చేస్తున్నాని ఆయన పేర్కొన్నారు. పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువ అవుతానని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News