ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ విడుదలపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతున్నా ఇంకా విజువల్ ఎఫెక్ట్, గ్రాఫిక్స్ వర్క్పై పూర్తి క్లారిటీ రాలేదు. ఇప్పటికి 70 శాతం చిత్రీకరణ మాత్రమే పూర్తయింది. అంటే మరో 30 శాతం చిత్రీకరణను పూర్తిచేయాలి. అటుపై గ్రాఫిక్స్కి సంబంధించిన కీలకమైన పనులను చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆసక్తికర చర్చ సాగుతోంది. జూలై 30న సినిమా రిలీజ్ అని చెప్పారు. కేవలం ఆరు నెలల్లోనే ఇంత భారీ ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ పనులను పూర్తవుతాయా? అన్న చర్చ సాగుతోంది.
ఇప్పటివరకూ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రాలేదు. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టినా చరణ్, ఎన్టీఆర్ లకు సంబంధించిన లుక్లను టీమ్ రిలీజ్ చేయలేదు. అయితే సంక్రాంతి నుంచి ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రచారానికి టీమ్ ప్లాన్ చేస్తోందని అంటున్నారు. తాజాగా చిత్ర కథానాయకుడు రామ్చరణ్ విడుదల తేదీపై మరోసారి పక్కా క్లారిటీనిచ్చారు. ఈ చిత్రాన్ని ముందే ప్రకటించిన తేదీకే రిలీజ్ చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు పనులన్నీ వేగంగా పూర్తవుతున్నాయనీ, 70శాతం చిత్రీకరణ ఇప్పటికే పూర్తయిందని తెలిపారు.