Sunday, April 28, 2024

వేగంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనులు

- Advertisement -
- Advertisement -

ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా నిర్మాణ పనులు చేపట్టాలి
ద.మ రైల్వే జిఎం అరుణ్ కుమార్ జైన్ ఆదేశం

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రపంచ స్థాయి సౌకర్యాల కల్పన, ఆధునికత మేళవింపుతో పునర్నిర్మాణం కోసం రైల్వే మంత్రిత్వ శాఖ చేపట్టిన ప్రధాన రైల్వే స్టేషన్లలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒకటి. అందులో భాగంగానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు సుమారు రూ.720 కోట్ల వ్యయంతో 36 నెలల్లో పూర్తిచేయడానికి ఓ ప్రైవేటు సంస్థకు ఈపిసీ విధానంలో నిర్మించేందుకై పనులు కేటాయించింది. తదనుగుణంగా నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తయ్యేలా ఆ సంస్థ చర్యలు తీసుకుంటోంది.

ప్రస్తుత స్టేషన్ భవనానికి రెండు వైపులా పనులు ప్రారంభించడమే కాకుండా ఉత్తరం వైపు ప్రస్తుతం ఉన్న బుకింగ్ కార్యాలయం స్థానంలో ప్రయాణికుల సేవలకు అంతరాయం కలగకుండా చూసుకుంటోంది. అదేవిధంగా కొత్త ఆర్‌పిఎఫ్ భవనం పనులు పూర్తి అవడంతో పాటు ఇతర పునరాభివృద్ధి పనుల కోసం నిర్మాణ పనులు పురోగతిలోఉన్నాయి . దక్షిణం వైపున ఉన్న పునాదులకు సంబంధించి పలు చర్యలు తీసుకుంటున్నారు. దాదాపు 200 కార్లు బేస్మెంట్ 2 లో పార్కింగ్ చేసుకొనే సామర్థ్యం కలిగి ఉండగా ప్రస్తుత స్టేషన్ భవనం దక్షిణం వైపున మిగిలిన నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయడానికి , వాహనాల రాకపోకలు సజావుగా సాగించేందుకు వీలుగా తాత్కాలిక రహదారి కూడా ఏర్పాటుచేశారు. స్టేషన్ అవసరాలను తీర్చడం కోసం ప్రస్తుతం ఉన్న 11 కెవి విద్యుత్ స్థానంలో 33 కెవి విద్యుత్ కెపాసిటి గల రెండు విద్యుత్ సబ్ స్టేషన్లు రానున్నాయి. కాగా మిగతా ముగింపు పనులు పురోగతిలో ఉన్నాయి.

ఉత్తరం వైపున మల్టీ-లెవల్ కార్ పార్కింగ్ (ఎమ్.ఎల్.సి.పి) నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. పునరాభివృద్ధి చేయబడిన స్టేషన్ భవనం ఉత్తరం వైపున 6- అంతస్తుల ఎమ్.ఎల్.సి.పిని కలిగి ఉంటుంది. ప్రస్తుతం 50 శాతం పైగా పునాది పనులు , గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ పనులు కూడా పూర్తయ్యాయి. ఇదే సమయంలో పునరాభివృద్ధి పనులను సులభతరం చేయడానికి ఉత్తరం వైపున ప్రస్తుతం వాడుకలో ఉన్న 25 శాతం స్టేషన్ భవనాన్నిమరింతగా అభివృద్ధి చేస్తున్నారు. కాజీపేట వైపు కొత్త పాదచారుల వంతెన నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి, దీని కోసం రెండు ప్లాట్ ఫార్మ్‌లపై పునాది పనులు పూర్తి కాగా ఇతర పనులు కొనసాగుతున్నాయి.

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రైలు ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. నూతనంగా నిర్మించే స్టేషన్ భవనంలో రైలు ప్రయాణికులకు ఆధునిక నిర్మాణాలు, ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఉంటాయని తెలిపారు. పని పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని , భద్రతాపరమైన అన్ని చర్యలను జాగ్రత్తగా పాటిస్తూ నిర్మాణ పనులను సక్రమంగా చేపట్టాలని అధికారులకు సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News