ఆ పాట అధరామృతం.. ఆ గానం గంధర్వ గానం. ఆయన గళం విప్పితే పాటే ఆయనకు ప్రణమిల్లుతుంది. అందుకే ఎస్.పి.బాలసుబ్రమణ్యం గాన గంధర్వుడయ్యారు. స్వర బ్రహ్మగా జన నీరాజనాలు అందుకుంటున్నారు. ఆ స్వరబ్రహ్మ 75వ జయంతి (డైమండ్ జూబ్లీ) సందర్భంగా తెలుగు చిత్ర సీమ ఆయన జయంతి రోజైన జూన్ 4న స్వరనీరాజనం అందించబోతోంది. తెలుగు సినిమాకే కాకుండా భారతీయ సినిమాకి బాలు చేసిన సేవల్ని గుర్తు చేస్తూ ఆయనకు ఘననివాళి అర్పించబోతోంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ 12 గంటలపాటు లైవ్ ప్రోగ్రామ్ను తెలుగు చిత్ర పరిశ్రమ ఏర్పాటు చేయబోతోంది.
ఇందులో అతిరథమహారథులైన తెలుగు హీరోలు, దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు, పాటల రచయితలు పాలు పంచుకోబోతున్నారు. ఆ రోజును బాలుకు అంకితం చేయబోతున్నారు. తెలుగు సినిమా రంగం ఒక్క తాటిపైకి వచ్చి అంతర్జాలం వేదికగా చేపడుతున్న బృహత్తర కార్యక్రమమిది. ఆ గుండె గొంతుక ఎప్పటికీ మూగవోదని, ఆయన పాటలోని మాధుర్యం ఎన్నటికీ తరగబోదని చాటబోతున్నారు. ఈ కార్యక్రమంపై డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్. శంకర్, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ “ఇది దాదాపు 12 గంటలపాటు లైవ్ ప్రోగ్రామ్గా కొనసాగుతుంది. దీనికి పరిశ్రమ అంతా సహకరిస్తోంది. నాన్ స్టాప్గా జరిగే ఈ ప్రోగ్రామ్ని చూసి అందరూ జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం”అని అన్నారు.