మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పాడిపరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇటీవల జరిగిన మదర్ డెయిరీ పాలకవర్గం ఎన్నికల్లో గెలుపొందిన చైర్మన్ గంగుల కృష్ణారెడ్డితోపాటు పలువురు డైరెక్టర్లు శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ పాడి రంగం అభివృద్ధికోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. పాడి పరిశ్రమ అభివృద్ధితోపాటు ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి ప్రభుత్వం అన్ని విధాల చేయూతను అందిస్తుందన్నారు. పాడి రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోని అభివృద్ధి సాధించేలా పాలకవర్గం కృషి చేయాలని కోరారు. మదర్ డెయిరీ పాలక వర్గానికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా మంత్రిని చైర్మన్ గంగుల కృష్ణారెడ్డితోపాటు డైరెక్టర్లు సురేందర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి ,సోమిరెడ్డి, జయశ్రీ, అలివేలు , డెయిరీ ఎండి అశోక్ కుమార్ తదితరులు పూలమాలతో సత్కరించారు.