Thursday, May 2, 2024

సంక్షేమ పథంలో తెలంగాణ

- Advertisement -
- Advertisement -

విద్యార్థి దశ నుండి సామాన్యుడిగా వచ్చి రాజకీయాల్లో అనన్య సామాన్యమైన విజయాలను తన ఖాతాలో వేసుకున్న గొప్ప నాయకుడు. రాజనీతి తెలిసినవాడు. ప్రజల నాడి పట్టుకోవడంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌కు సాటి మరెవరూ లేరంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ రాష్ట్ర సాధన కలను సాకారం చేసి దేశం దృష్టి తెలంగాణపై పడేలా చేసిన కెసిఆర్ అపర చాణక్యుడిలా ఉద్యమాన్ని నడిపి తెలంగాణను సాధించే వ్యక్తిగా నిలిచారు. దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచేపోయే నాయకుడు కెసిఆర్. అనేక సవాళ్ళు, అవరోధాల మధ్య నెమ్మదిగా ప్రారంభమైన తెలంగాణ ప్రగతి ప్రస్థానం నేడు పరుగులు తీస్తోందంటే, అనేక సంక్షేమ పథకాల్ని అమలు చేస్తే బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణను సాధించి సిఎంగా బాధ్యతలు చేపట్టిన కెసిఆర్ బంగారు తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. రాష్ట్ర ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాల్ని తీసుకొచ్చారు. నీటి కష్టాల్ని తొలగించేందుకు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి అద్భుతమైన పథకాలను ప్రారంభించారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా, పారిశ్రామికంగా ముందు వరుసలో నిలిపేందుకు కెసిఆర్ నిరంతరం శ్రమిస్తున్నారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణం కావాలనే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు పథక రచన చేశారు కెసిఆర్. పేదల కోసం అనేక సంక్షేమ పథకాల్ని తీసుకొచ్చారు. అన్నదాతల కోసం రైతుబంధును అమలుచేశారు. ఇలా రాష్ట్రం సుభిక్షం కోసం నిరంతరం శ్రామికుడిలా పని చేస్తున్నారు కెసిఆర్.

ప్రతిరంగంలోనూ యావద్దేశం నివ్వెరపోయే ఫలితాలను సాధిస్తూ ప్రగతి పథంలో పరుగులు పెడుతున్న తెలంగాణ దేశంలోనే అత్యంత బలీయమైన ఆర్థికశక్తిగా ఎదగడం ఒక చరిత్రాత్మక విజయం. ‘సమైక్య పాలకులు అనుసరించిన వివక్షాపూరిత విధానాలను మార్చేయడానికి పూనుకున్నది. ‘ఆదివాసీ, గిరిజనుల చిరకాల ఆకాంక్షను తెలంగాణ ప్రభుత్వం పోడు సమస్యకు శాశ్వత పరిష్కారంగా గిరిజనులకు భూములపై హక్కులు కల్పిస్తున్నది.అటవీ భూములపై ఆధారపడిన ఒక లక్షా యాభై వేల మంది ఆదివాసీ, గిరిజనులకు నాలుగు లక్షల ఎకరాల పోడు భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తున్నది. దీనికి రైతుబంధు పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటున్నది. ‘దళితులు స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలన్న ఆశయంతో ‘దళిత బంధు’ అనే విప్లవాత్మక పథకాన్ని అమలు చేస్తున్నది. చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల మొత్తాన్ని నూరు శాతం గ్రాంట్‌గా అందిస్తున్నది. ఆత్మగౌరవంతో జీవించడానికి ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ఆర్థిక, సామాజిక వివక్ష నుండి దూరం చేయడానికి ఈ పథకం ఎంతో దోహదపడుతుంది.

‘తెలంగాణ భూభౌతిక పరిస్థితికి అనుగుణంగా కాకతీయ రాజులు నిర్మించిన గొలుసుకట్టు చెరువుల సాగు నీటి వ్యవస్థ తెలంగాణకు ప్రాణప్రదమైనది. దేశంలో చాలా చోట్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఉబికిఉబికిపైకి వస్తున్నాయి. గంగాళాల వంటి చెరువులు పూడిక నిండి తాంబాళాల్లా తయారైనాయి. చెరువులకు నవజీవం తెచ్చే పథకానికి కాకతీయుల స్మరణలో మిషన్ కాకతీయగా స్వయంగా నామకరణం చేశారు.‘రాష్ట్రం స్వల్ప వ్యవధిలో వైద్యారోగ్య రంగాన్ని విస్తృత పరిచింది. వైద్య సేవల ప్రమాణాలను పెంచింది. నేడు స్వపరిపాలనలో ఆరోగ్య రంగం ప్రజలకు అత్యంత చేరువయింది. అన్ని దవాఖానాల్లో మౌలిక వసతులు పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకున్నారు. ఆస్పత్రులలో అవసరమైన వైద్య పరికరాలు, సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. విశ్వసనీయతను పెంచుకున్నది. ప్రజలకు ఆరోగ్య భాగ్యాన్ని అందించడంలో నేడు రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచింది.

‘రైతులు పంట పెట్టుబడి కోసం అనేక తిప్పలుపడాల్సి వచ్చేది. అధిక వడ్డీలతో అప్పులు తెచ్చి పెట్టుబడిపెట్టే దారుణ పరిస్థితి ఉండేది. రైతులకు ప్రభుత్వమే నేరుగా పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించారు. అలా పుట్టిందే రైతుబంధు పథకం. రైతుబంధుతో రైతుల్లో భరోసా పెరిగింది. రైతుబంధు పథకానికి దేశ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్నది. దేశంలోని రైతులంతా ఈ పథకానికి ఆకర్షితులవుతున్నారు. రైతుబంధు తరహా పథకాన్ని తమ రాష్ట్రంలోనూ అమలు చేయాలని అనేక రాష్ట్రాల రైతులు అక్కడి ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు.

‘రైతుబంధుతో రైతుల్లో భరోసా పెరిగింది. పెట్టుబడి నష్టమనే భావన లేకుండా రైతులు ధైర్యంగా వ్యవసాయం చేస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు, 24 గంటల ఉచిత విద్యుత్తు, సకాలంలో ఎరువులు, విత్తనాల సరఫరా వంటి కార్యక్రమాలతో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. తద్వారా 2014- 15లో 1.31 కోట్ల ఎకరాల్లో పంటలు సాగైతే, 2022- 23లో ఇది 2.09 కోట్ల ఎకరాలకు పెరిగింది. ధాన్యం ఉత్పత్తిలో దేశంలో 15వ స్థానంలో ఉండగా అది రెండో స్థానానికి వచ్చింది. ‘తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకార అవుతుంది, సమైక్య పాలకులు ఎద్దేవా చేశారు. శాపనార్ధాలు పెట్టారు. వారి అంచనాలను తలక్రిందులుచేస్తూ తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు రంగంలో విప్లవాత్మక విజయాలు సాధించింది. రాష్ట్రంలో విద్యుత్తు రంగాన్ని తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వం త్రిముఖ వ్యూహాన్ని అనుసరించింది. నేడు అన్ని రంగాలకు నిరంతరాయంగా 24 గం. పాటు, వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్తు సరఫరా చేసే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ కీర్తి దేశం నలుదిశలా వ్యాపించింది. ఇది దేశానికే ఆదర్శం.

‘గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సంపూర్ణ పరివర్తనను సాధించేందుకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరుతో సమగ్ర ప్రణాళికలను ప్రవేశపెట్టింది. ఒకప్పుడు తెలంగాణ పల్లెలు, పట్టణాల్లో ఎక్కడ చూసినా చెత్తాచెదారం పేరుకుపోయి కనిపించేది. పరిసరాలు అపరిశుభ్రంగానూ, దుర్గంధభూయిష్టంగానూ ఉండేవి. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా, పల్లెలు, పట్టణాల సమగ్రాభివృద్ధి కోసం చేపట్టిన పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాలు గ్రామాల, పట్టణాల రూపురేఖలనే మార్చివేశాయి. ‘అన్ని వర్గాలలో విశ్వాసాన్ని నెలకొల్పుతూ సంక్షేమ ఫలాలను సర్వజనులకూ అందిస్తున్నది. మైనారిటీల అభివృద్ధి కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నది. ఇమామ్‌లకు, మౌజమ్‌లకు నెలకు రూ. 5 వేల చొప్పున మొత్తం 10 వేల మందికి జీవన భృతిని అందజేస్తున్నది. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఓన్ యువర్ ఆటో, డ్రైవర్ ఎంపవర్‌మెంట్ పథకం, ఓవర్సీస్ స్కాలర్‌షిప్స్ తదితర కార్యక్రమాలను అమలు చేస్తున్నది.

ప్రభుత్వమే అధికారికంగా రంజాన్, క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠకు ఉజ్వల సంకేతంగా నిలిచింది. సచివాలయానికి మరోవంక అమరవీరుల స్మారకం నిర్మించుకున్నాం. ఒక వంక 125 అడుగుల ఎత్తులో డా. అంబేడ్కర్ విగ్రహం, దానికి ఎదురుగా హుస్సేన్‌సాగర్‌లో బుద్ధుని విగ్రహం, నభూతో న భవిష్యతి అన్నరీతిన నిర్మించిన సచివాలయ సౌధం, మరోవంక అమరవీరులను ప్రతిరోజూ స్మరణకు తెచ్చే అమరజ్యోతి చూసేందుకు సుందరంగా ఉండటమే కాదు, ప్రతి నిత్యం మనకు కర్తవ్య బోధ చేస్తుంటాయి.‘స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత నేతన్నల జీవితాలలో వెలుగులు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ, సహాయ కార్యక్రమాలను చేపట్టింది. చేనేత కార్మికులకు నూలు, రంగులపై కేంద్ర ప్రభుత్వం కేవలం 10% సబ్సిడీ ఇచ్చి చేతులు దులుపుకొంటే, తెలంగాణ ప్రభుత్వం చేనేత మిత్ర పథకం కింద 40% సబ్సిడీ అందిస్తున్నది. దీనివల్ల పరిశ్రమల స్థాపనకు అనుమతుల మంజూరు సులభతరమైంది. దీనికి తోడు 24 గంటలు విద్యుత్తు, మెరుగైన శాంతిభద్రతలు, స్థిరమైన, సమర్థవంతమైన పరిపాలన పరిశ్రమలకు వరంగా మారాయి. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఎన్నింటికో ఇప్పుడు తెలంగాణ ఆకర్షణీయ గమ్యస్థానమైంది. టిఎస్ ఐపాస్ చట్టం రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది.

‘నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడం కోసం డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణం చేపట్టాం. ఉచితంగా రెండు పడకగదుల ఇళ్ళను నిర్మించి ఇచ్చే పథకం మరెక్కడా లేదు. దేశంలో ఎక్కడా పేదల కోసం ఇటువంటి ఇళ్ళ నిర్మాణం జరగ లేదు. గృహలక్ష్మి పథకం క్రింద 3 లక్షల రూపాయలను మూడు దశల్లో అందిస్తుందని ఇదివరకే తెలియజేశారు. ప్రతి నియోజక వర్గంలోనూ మూడు వేల మందికి గృహలక్ష్మి పథకం ప్రయోజనం అందించుకుంటున్నారు. ‘తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధితో పాటు, ఆసరా అంటే ‘సాయం’. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, కుటుంబంలో సంపాదించే వ్యక్తులు లేని వారి కోసం సాయంగా నిలించేందుకే తెలంగాణ ప్రభుత్వం, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, పైలేరియా బాధితులు, డయాలసిస్ రోగులకు కూడా పెన్షన్ అందుతుంది. రాష్ట్రంలో పింఛను కింద ఇచ్చే మొత్తాన్ని 2,016 రూపాయలకు పెంచారు.

దివ్యాంగులకు చెల్లించే రూ. 3116 పెన్షన్ ఇస్తుండగా, దానిని రూ.4116కు పెన్షన్ మొత్తాన్ని పెంచడంతో, దేశంలో ఎక్కడ లేని విధగా గొప్ప చారిత్రక నిర్ణయం. ‘తెలంగాణ రైతుకు కంట కన్నీరే తప్ప, సమైక్య రాష్ట్రంలో పొలాలకు ఏనాడూ సాగునీరు లభించలేదు. తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే సంవత్సరాల తరబడి నిర్లక్ష్యంగా నిలిచిపోయిన ప్రాజెక్టులను సత్వరం పూర్తిచేయడం, నేడు పంట కాలువలతో పచ్చని చేలతో కళకళలాడుతున్నది. దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా విలసిల్లుతున్నది.తెలంగాణ ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా దాని వెనుక ఉండేది మానవీయకోణమే. పేదలు అనుభవించే ప్రతి సమస్యనూ సూక్ష్మంగా అర్థం చేసుకొని పరిష్కరించే దిశగానే ప్రభుత్వం ప్రతి ప్రయత్నమూ కొనసాగుతున్నది. తెలంగాణ ప్రభుత్వ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా, ఆచరణీయంగా నిలవడమే కాదు ఆయా రాష్ట్రాల ప్రజలు తమకు కూడా తెలంగాణ తరహా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. తెలంగాణ అభివృద్ధి మోడల్‌తో ఇప్పుడు దేశ్ కీ నేతగా ప్రస్తానం మొదలుపెట్టారు.

-తీగల అశోక్ కుమార్, 7989114086

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News