Tuesday, April 30, 2024

కలిసొచ్చిన వారసత్వం

- Advertisement -
- Advertisement -

పలు పార్టీలలో ప్రముఖులుగా వెలుగుతున్న నేతలు, బిఆర్‌ఎస్‌లో కెటిఆర్, హస్తంలో భట్టి విక్రమార్క
బిజెపిలో మర్రి శశిధర్‌రెడ్డి, డికె అరుణ,  వారసత్వానికి నిలువుట్టదంగా నిలుస్తున్న ఓవైసీ బ్రదర్స్

(డి.నాగరాజు/మనతెలంగాణ):  రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వారసత్వ నాయకుల ప్రచారంపై జోరుగా చర్చ సాగుతోంది. ఎంతోమంది తమ తల్లిదండ్రులు, సోదరుల ప్రోత్సాహం తో రాజకీయాల్లో అడుగులు పెట్టి తమకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న నాయకులు ప్రస్తుత ఎన్నికల్లో అగ్రస్ధానంలో నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీలో మల్లు భట్టివిక్రమార్క తన సోదరుడు మల్లు అనంతరాములు వారసునిగా రాజకీయాల్లో ప్రవేశించి ఆపార్టీలో కీలక నేతగా ఎదిగి కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షనేతగా ఉంటూ ప్రచారంలో దూసుకపోతున్నారు. 2004లో మొదటిసారిగా మధిర నుంచి పోటీ చేసిన గెలిచి ఇప్పటివరకు ఓటమి చవిచూడకుండా జిల్లా రాజకీయాలను తన గుప్పిట్లో పెట్టుకున్నారు.

అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తనయుడు మంత్రి కెటిఆర్ 2009లో మొదటిసారి అసెంబ్లీ బరిలోకి దిగి విజయం సాధించి, రెండు పర్యాయాలు మంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవలందిస్తూ నాలుగోసారి సిరిసిల్ల నుంచి పోటీ చేస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడుగా పేరు సంపాదించి తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేక స్ధానం సంపాదించుకున్నారు. విపక్ష నాయకుల విమర్శలకు సూటిగా సమాధానం చెబుతూ పదేళ్ల పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమ ఫలాలను వివరిస్తూ చిన్న వయస్సులో మంచి వాగ్దాటి గల నేతగా గుర్తింపు పొందారు. మరోనేత మాజీ సిఎం మర్రి చెన్నారెడ్డి కుమారుడు మర్రి శశిధర్‌రెడ్డి కూడా తండ్రి వారసత్వం నేటికీ కొనసాగిస్తూ ప్రజా సేవలో ఉన్నారు. నాలుగు సార్లు సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై గ్రేటర్ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆయన బిజెపి పార్టీ నుంచి ఎన్నికల సమరంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో తలపడుతున్నారు. అదే విధంగా ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సిపిఎం నేత పువ్వాడ నాగేశ్వర్‌రావు వారసుడిగా రాజకీయాలలోకి వచ్చి రెండు పర్యాయాలు ఖమ్మం శాసనసభ్యునిగా విజయం సాధించి మంత్రిగా ప్రజలకు సేవలందిస్తున్నారు.

నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా ఉంటూ ఎన్నికల్లో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు. మహిళానేతగా మాజీ మంత్రి డికె అరుణ తన తండ్రి చిట్టెం నర్సిరెడ్డి వారసురాలిగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో మంచి గుర్తింపు పొదారు. గద్వాల్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒక సారి మంత్రిగా పనిచేసి ప్రస్తుతం బిజెపి నుంచి పాలమూరు జిల్లా రాజకీయాలను శాసిస్తున్నారు. నోముల నరసింహయ్య తనయుడు యువ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ కూడా రెండున్నర ఏళ్ల కితం తన తండ్రి అకాల మరణంతో రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్ర రాజకీయాల్లో తలపండిన నేత మాజీ మంత్రి కుందురు జానారెడ్డిని ఓడించి యువత సత్తా ఏమిటో చాటి నల్లగొండ జిల్లా ప్రజలకు సుపరిచితులైయ్యారు. ప్రస్తుతం రెండోసారి జానారెడ్డి తనయుడు జైవీర్‌రెడ్డిపై పోటీ చేస్తూ ప్రచారంలో దూసుకపోతున్నారు. వారసత్వ రాజకీయాలకు నిలువుటద్దం ఓవైసీ సోదరులు హైదరాబాద్‌కే పరిమితమైన మజ్లిస్ పార్టీ నేడు దేశ రాజకీయాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సల్లావుద్దీ న్ ఓవైసీ నుంచి ప్రారంభమైన పార్టీ నేడు గ్రేటర్‌లో 9 స్ధానాల్లో పోటీ చేస్తోంది. తండ్రి స్దాపించిన పార్టీని ఓవైసీ సోదరులు అసదుద్దీన్, అక్బరుద్దీన్ చాపకింది నీరులా విస్తరించి పాతబస్తీలో మకుటం లేని మహరాజులుగా వెలుగొందుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News