Tuesday, April 30, 2024

నీటి ట్యాంకర్ల సరఫరాలో ఆలస్యం కాకుండా చూడాలి

- Advertisement -
- Advertisement -

ఫిల్లింగ్ స్టేషన్లను తనిఖీ చేసిన జలమండలి ఎండి సుదర్శన్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: నగరంలో నీటి సరఫరా ట్యాంకర్ డెలివరీలో ఆలస్యం కాకుండా చూడాలని, బుక్ చేసిన వెంటనే ట్యాంకర్ పంపించే ప్రయత్నం చేయాలని జలమండలి ఎండి సుదర్శన్‌ రెడ్డి అధికారులకు ఆదేశించారు. పెండెన్సీని తగ్గించుకోవడానికి స్థానిక అధికారులు వాళ్ల పరిధిలో ప్లాన్ చేసుకోవాలని వివరించారు. బుకింగ్ లు ఎక్కువ వస్తూ, డెలివరీలు పెండింగ్‌లో ఉన్న కేంద్రాల్లో రెండు షిఫ్టుల్లో పని చేయడానికి తగిన సిబ్బందిని సమకూర్చుకోవాలని సూచించారు. శుక్రవారం వెంకట గిరి ఫిల్లింగ్ స్టేషన్‌కు వెళ్లి ట్యాంకర్ బుకింగ్, డెలివరీ తదితర వివరాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

బుకింగ్ టైమింగ్స్, ఏ సమయానికి డెలివరీ ప్రారంభిస్తున్నారనే విషయాలపై ఆరా తీశారు. ట్యాంకర్ డెలివరీకి సంబంధించిన ఇన్ అండ్ ఔట్ లాగ్ బుక్స్ పరిశీలించారు. లాగ్ బుక్స్ సక్రమంగా నిర్వహించాలని అందులో టైమింగ్స్ తప్పని సరిగా నమోదు చేయాలన్నారు. డిమాండ్ ను బట్టి డెలివరీ టైమింగ్స్‌ను కూడా పెంచుకోవాలని వివరించారు. ట్యాంకర్లలో నింపుతున్న నీటి శాంపిల్ తీసుకుని పరీక్షించారు. ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. పంపు రూమ్ లను, క్లోరినేషన్ రూమ్ లను కూడా పరిశీలించారు.

ట్యాంకర్ డ్రైవర్లతో ఎండీ ఇంటరాక్షన్:
ట్యాంకర్ డ్రైవర్లతో ఎండీ సుదర్శన్ మాట్లాడారు. ట్యాంకర్ డెలివరీల్లో ఏవైనా ఇబ్బందులున్నాయా? అని ఆరా తీశారు. ట్రాఫిక్ జామ్ సమయాల్లో ట్యాంకర్ డెలివరీ ఆలస్యమవుతుందని ఎండీ గుర్తించారు.ట్యాంకర్ ఇన్ ఛార్జులతో మాట్లాడి ఈ పాస్ మిషన్, స్మార్ట్ కార్డుల పనితీరును అడిగి తెలుసుకున్నారు.

సిసి కెమెరాల పనితీరు పరిశీలన:
ఫిల్లింగ్ స్టేషన్లలోని సిసి కెమెరాలు సక్రమంగా పని చేస్తున్నాయో లేదో పరిశీలించారు. ఇప్పటికే అన్ని స్టేషన్ల కెమెరాలు ప్రధాన కార్యాలయానికి అనుసంధానమై ఉన్నాయని.. నిరంతరం వాటి ద్వారా అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డైరెక్టర్ విఎల్. ప్రవీణ్ కుమార్, సిజిఎం విజయరావు, సంబంధిత జిఎం, డిజిఎం, మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News