ఎగురవేసిన బిజెపి ఎంపి కిరోరీమీనా
మీనా గిరిజనులకూ హిందూత్వ సంస్థలకూ మధ్య కోటపై వివాదం..
జైపూర్: జైపూర్లోని ఆంబాగఢ్ కోట గోడపై బిజెపి ఎంపి కిరోరీమీనా గిరిజనులకు చెందిన తెల్లజెండా ఎగురవేయడం వివాదాస్పదంగా మారింది. కోటచుట్టూ భారీ బందోబస్త్ ఉన్న సమయంలో ఆదివారం ఉదయం ఆయన ఈ ఘటనకు పాల్పడ్డారు. పదిమందికిపైగా అనుచరులతో కలిసి కోట వెనకభాగంలోని ఓ చిన్న గోడపై జెండా ఎగురవేశారు. కాగా,కోట లోపలికి మీనాను వెళ్లకుండా అడ్డుకున్నామని పోలీసులు తెలిపారు.
మీనాను అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. అయితే, ఆయన డిమాండ్లపై చర్చించేందుకు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లామన్నారు. కోటలోని శివాలయంలో పూజల నిర్వహణకు గిరిజనులకు అనుమతి ఇవ్వాలన్నది మీనా డిమాండ్లలో ఒకటి. ప్రస్తుతం ఆ ఆలయం అటవీశాఖ ఆధీనంలో ఉన్నది. తనను అరెస్ట్ చేశారని, ఆలయంలోకి వెళ్లలేకపోయానని మీనా ట్విట్ చేశారు. స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.
18వ శతాబ్దానికి చెందిన ఈ కోటపై ఇటీవల మీనా గిరిజనులకూ హిందూత్వ సంస్థలకు మధ్య వివాదం తలెత్తింది. జూన్లో కోటపై ఉన్న కాషాయ జెండాను మీనా వర్గానికి చెందిన కొందరు యువకులు తొలగించడంతో వివాదం మొదలైంది. ఆ యువకులకు స్వతంత్ర ఎంఎల్ఎ రాంకేశ్మీనా నేతృత్వం వహించారన్న ఆరోపణలున్నాయి. ఈ అంశంలో రెండు వర్గాలపైనా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అయితే, కిరోరీ మీనా మాత్రం మీనాలు హిందువులేనని అంటున్నారు. సామరస్య వాతావరణాన్ని భగ్నం చేసేందుకు యత్నించిన రాంకేశ్మీనాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.