1579 వార్డులు.. 154 డివిజన్లు కైవసం
కాంగ్రెస్కు మున్సిపాలిటీల్లో 537 వార్డులు, 40 డివిజన్లు
బిజెపి 236 వార్డులు, 65 డివిజన్లలో విజయం
ఎంఐఎం 69 వార్డులు, 17 డివిజన్లలో గెలుపు
స్వతంత్రులు, ఇతరులు 306 వార్డులు, 49 డివిజన్లలో జయకేతనం
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ హవా కొనసాగింది. మొత్తం 120 మున్సిపాలిటీల్లో 2727 వార్డులకు జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కలిపి 1579 వార్డులలో టిఆర్ఎస్ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ 537 వార్డులు, బిజెపి 236 వార్డులు, ఎంఐఎం 69 వార్డులు, స్వతంత్రులు, ఇతర రిజిస్టర్ పార్టీల నుంచి పోటీ చేసి 306 వార్డులలో గెలుపొందారు దీంతో 110 మున్సిపాలిటీల ఛైర్ పర్సన్ పదవులు అధికార పార్టీకే దక్కనున్నాయి. అలాగే తొమ్మిది కార్పొరేషన్లలో 325 వార్డులకు జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కలిపి 154 డివిజన్లను టిఆర్ఎస్ కైవసం చేసుకుంది. మరిపెడ మున్సిపాలిటీలో 15 వార్డులు, భీమ్గల్లో 12 వార్డులు టిఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. కార్పొరేషన్ డివిజన్లలో కాంగ్రెస్ 40, బిజెపి 65, ఎంఐఎం 17, ఇతరులు 49 స్థానాలలో గెలుపొందారు.
రామగుండం, మీర్పేట, బడంగ్పేట, బండ్లగూడ జాగీర్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేటలో టిఆర్ఎస్ స్పష్టమైన మెజార్టీతో డివిజన్లను గెలుచుకుంది. నిజామాబాద్ కార్పొరేషన్లో 60 డివిజన్లకు గాను టిఆర్ఎస్ 13, ఎంఐఎం 16 గెలిచాయి. అయితే బిజెపి 28 స్థానాలలో గెలుపొందినప్పటికీ మ్యాజిక్ ఫిగర్కు ఇంకా మూడు స్థానాలు కావాల్సి ఉంది. ఈ కార్పొరేషన్లో కాంగ్రెస్ అభ్యర్థులు రెండు, ఇతరులు ఒక డివిజన్లో గెలుపొందారు. దీంతో టిఆర్ఎస్, ఎంఐఎం కలిసి కార్పొరేషన్ పాలక వర్గాన్ని చేపట్టనున్నాయి. అయితే మేయర్ ఎన్నిక నాడు ఎక్స్ ఆఫిషియో ఓటింగ్ ఆధారంగా మేయర్ ఏ పార్టీ వశం కానుందో తేలనుంది.