Tuesday, May 7, 2024

కొత్త పోస్టులు 14,954

- Advertisement -
- Advertisement -
వివిధ శాఖల్లో కొత్తగా 14,954 పోస్టులను మంజూరు చేసిన ప్రభుత్వం
జిఓ 85లో ఉత్తర్వులు జారీ చేసిన ఆర్ధిక శాఖ

హైదరాబాద్: రాష్ట్రంలోని విఆర్‌ఏలను వివిధ శాఖల్లో సర్దుబాటు చేస్తూ ప్రభుత్వం జిఓ జారీ చేసింది. విఆర్‌ఏలను సర్దుబాటు చేసేందుకు నూతనంగా పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. అందులో భాగంగా వివిధ శాఖల్లో కొత్తగా 14,954 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పోస్టుల మంజూరుకు ఆర్థిక శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రెవెన్యూ శాఖలో 2,451 జూనియర్ అసిస్టెంట్, పురపాలక శాఖలో 1, 266 వార్డు ఆఫీసర్ పోస్టులు, రెవెన్యూ శాఖలో 679 సబార్డినేట్ పోస్టులు, నీటిపారుదల శాఖలో 5,063 లష్కర్, హెల్పర్ పోస్టులు, మిషన్ భగీరథలో 3,372 పోస్టులు, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో 2,113 రికార్డ్ అసిస్టెంట్ పోస్టులను ప్రభుత్వం కొత్తగా సృష్టించింది.

అయితే, విద్యార్హతలు, ఖాళీల ఆధారంగా వివిధ శాఖల్లోకి 20, 555 మంది విఆర్‌ఏలను సర్దుబాటు చేసే బాధ్యతను కలెక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. విద్యార్హతల మేరకు ఆఫీస్ సబార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పేస్కేల్‌ను వర్తింప జేసింది. అయితే, వీరిలో 61 ఏళ్లు దాటిన 3,797 మంది వారసులకు ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. వయస్సు నిర్ధారణకు ఈ ఏడాది జూలై 1వ తేదీని కటాఫ్ తేదీగా నిర్ధారించింది. అప్పటికీ 61 ఏళ్లలోపు వయసున్న వారికి నేరుగా పోస్టింగ్ ఇవ్వనున్నట్లు ఆర్థిక శాఖ జిఓ 85లో తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News