ఏకగ్రీవాల పరంపర, పెద్దపల్లిలో మరో వార్డు కైవసం
హైదరాబాద్: మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థుల ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నారు. రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో వార్డుసభ్యులు, కార్పొరేటర్లు ఏకగ్రీవం అవుతున్నారు. టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆదేశాలమేరకు ఎక్కడికక్కడ ఆశావులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో టిఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నారు. సోమవారం పెద్దపల్లి మున్సిపాలిటీలోని 21వ వార్డు టిఆర్ఎస్ అభ్యర్థి చిట్టిరెడ్డి మమత రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ వార్డు నుంచి వివిధ పార్టీల నుంచి పోటీ ఉన్న అభ్యర్థులతో పాటు టిఆర్ఎస్ ఆశావాహులు పోటీ నుంచి తప్పుకోవడంతో మమతరెడ్డి ఏకగ్రీవమయ్యారు. ఇప్పటికే పెద్దపల్లి నుంచి 18వ వార్డు ఏకగ్రీవం కాగా సోమవారం 21వ వార్డులో ఏకగ్రీవంగా అభ్యర్థి ఎంపికయ్యారు.
అలాగే మంచిర్యాల మున్సిపాలిటీకి చెందిన 3వ వార్డు టిఆర్ఎస్ అభ్యర్థి కోమటిరెడ్డి చిన్నవెంకట్ రెడ్డి ఏకగ్రీవంగాఎన్నికయ్యారు. నామినేషన్ల గడువు మంగళవారంతో ముగుస్తుండటంతో టిఆర్ఎస్ ఆశావాహులు పెద్దఎత్తున నామినేషన్లను ఉపసంహరించుకుంటున్నారు. ఇప్పటివరుకు టిఆర్ఎస్ సాధించిన ఏకగ్రీవాల్లో బెల్లంపల్లి 17వ వార్డు సుదర్శన్, ఇబ్రహీంపట్నం 17వ వార్డు నజియా తహసిన్,18వ వార్డు జబీర్ అహ్మద్, పరకాల మున్సిపాలిటీ నుంచి 8వ వార్డు అడప రాములు, 16వ వార్డు బండి రమాదేవి,20వ వార్డు సోద అనిత, 27వ వార్డు పాలకుర్తి గోపి ఏకగ్రీవమయ్యారు.
అలాగే మహబూబాబాద్ 17వ వార్డు యాళ్ల పుష్పలత, సత్తుపల్లి 17వ వార్డు వేముల పల్లి పుష్పలత, అలంపూర్ 5వ వార్డు ఎరుకలి దేవన్న, వనపర్తి 5వ వార్డు మెగావత్ శాంతి, సిరిసిల్ల 34వ వార్డు దార్ల కీర్తన, కోరుట్ల 23వ వార్డు పుష్పాల ఉమాదేవి,పెద్దపల్లి 18వ వార్డు కోలిపాక శ్రీనివాస్, బాన్సువాడ 4వ వార్డు గైక్వాడ్ రుక్మిణి, దుండిగల్ 26వ వార్డు శంబీపూర్ కృష్ణ, ఇబ్రహీంపట్నం 17వ వార్డు లక్ష్మీ, 18వ వార్డుఇందిరాల రమేష్ టిఆర్ఎస్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే నిర్మల్,ఖానాపూర్ మున్సిపాలిటీల్లో పలువురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలున్నాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే నిర్మల్ మున్సిపాలిటీ నుంచి టిఆర్ఎస్ అభ్యర్థి గండ్రత్ ఈశ్వర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మంత్రి తెలిపారు.