Wednesday, May 15, 2024

మెడికల్ పిజిలో అమలుకాని ఇడబ్ల్యూఎస్ కోటా

- Advertisement -
- Advertisement -
అదనపు సీట్లు సృష్టించకుండా ఎన్‌ఎంసి తాత్సారం
నష్టపోతున్న అగ్రవర్ణ పేద విద్యార్థులు

హైదరాబాద్ : అగ్రవర్ణ పేద విద్యార్థుల కోసం అమలు చేస్తున్న ఇడబ్ల్యూఎస్  రిజర్వేషన్లు దేశంలోని దాదాపు అన్ని కోర్సులలో అమలవుతుండగా మెడికల్ పిజిలో మాత్రం అమలు కావడం లేదు. వైద్యవిద్యలో ఎంబిబిఎస్, ఆయుష్ యుజి, పిజి కోర్సులలో ఇడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలవుతున్నప్పటికీ మెడికల్ కోర్సులకు అమలు చేయడంపై నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్‌ఎంసి) దృష్టి సారించడం లేదు. ప్రస్తుతం ఎంబిబిఎస్, ఇతర కోర్సులలో అమలు చేస్తున్నట్లుగా మెడికల్ పిజి కోర్సులకు కూడా ఇడబ్ల్యూఎస్ కోటాను అమలు చేయాలి. అందుకోసం నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రత్యేకంగా మెడికల్ పిజి సీట్లను సృష్టించి ఆయా రాష్ట్రాల మెడికల్ యూనివర్సిటీలకు అందజేయాలి. గత కొన్నేళ్లుగా మెడికల్ పిజి సీట్లలో ఇడబ్ల్యూఎస్ కోటా అమలుపై ఎన్‌ఎంసి తాత్సారం చేయడంతో ప్రతిభ గల అగ్రవర్ణ పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. మెడికల్ పిజి కోర్సులలో ఇడబ్ల్యూఎస్  కోటా అమలు చేయకపోవడం పట్ల వైద్య విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మెడికల్ పిజి సీట్లకు భారీగా డిమాండ్
వైద్య విద్యలో పిజి సీట్లకు భారీగా డిమాండ్ ఉంది. ఎంబిబిఎస్ తర్వాత వైద్య విద్యార్థులలో చాలామంది పిజి చేసేందుకు మొగ్గు చూపుతారు. ప్రైవేట్‌లో ఈ సీట్లు కోట్లు పలుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మెడికల్ పిజి సీట్లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సీట్లకు కూడా ఇడబ్లూఎస్ కోటా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని వైద్య విద్యార్థులు కోరుతున్నారు.
పిజి వైద్య ప్రవేశాలకు ముగిసిన రిజిస్ట్రేషన్లు
రాష్ట్రంలో మెడికల్ పోస్టు గ్రాడ్యుయేట్ సీట్లలో భర్తీలో భాగంగా ప్రారంభమైన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సోమవారంతో ముగిసింది. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలోని కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. జాతీయ స్థాయి అర్హత పరీక్షా నీట్ 2023లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్ధేశిత ధరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి విద్యార్థులు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తులు, సర్టిఫికెట్లను యూనివర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తుంది. మెరిట్ జాబితా విడుదల అనంతరం వెబ్ ఆప్షన్లకు యూనివర్సిటీ మరో నోటిఫికేషన్ జారీ చేస్తుంది. తదనుగుణంగా అభ్యర్థులు ప్రాధాన్యత క్రమంలో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News