మేడారానికి తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్లు తమిళసై, దత్తాత్రేయ
ఘనస్వాగతం పలికిన మంత్రులు
వరంగల్ బ్యూరో: తెలంగాణ కుంభమేళ సమ్మక్క, సారలమ్మ మేడారం జాతరను శుక్రవారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయలు సందర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం 10గంటలకు ప్రత్యేక హెలిక్యాప్టర్లో హైదరాబాద్ నుంచి మేడారం చేరుకున్న ఇరువురి గవర్నర్లకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, ఇంద్రకరణ్రెడ్డి, సత్యవతిరాథోడ్, ఇతర ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. తెలంగాణ గవర్నర్ తమిళ సై కుటుంబసమేతంగా మేడారానికి విచ్చేశారు. వివిఐపిల రాకకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్శన ద్వా రం ద్వారా సమ్మక్క, సారలమ్మల గద్దెల వద్దకు చేరుకున్న తెలంగాణ గవర్నర్ తమిళసై ఆమె భర్త సౌందరరాజన్, కుమార్తె, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయలకు గిరిజన పూజారులు సాంప్రదాయ స్వాగతం పలికారు.
గద్దెల వద్దకు సాంప్రదాయ బద్ధంగా సారె, బుట్టలు తలపై పెట్టుకొని గవర్నర్లు ఇరువురు మొదట సమ్మక్క తల్లి గద్దె వద్దకు వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సారక్క తల్లి గద్దె వద్దకు చేరుకొని అమ్మవార్లకు సారెలు సమర్పించారు. పట్టువస్త్రాలు సమర్పించి పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే కొలువై ఉన్న గోవిందరాజులు, పగిడిద్దరాజుల గద్దెల వద్దకు వెళ్లి దర్శించుకున్నారు.
నిలువెత్తు బంగారం సమర్పించిన గవర్నర్
మొట్టమొదటిసారిగా మేడారం జాతరకు విచ్చేసిన తెలంగాణ గవర్నర్ తమిళసై నిలువెత్తు బంగారం అమ్మవార్లకు సమర్పించారు. గద్దెల సమీపంలోని తులాభారం వద్ద ఆమె ఎత్తు బెల్లాన్ని ఆలయ సిబ్బందికి అప్పగించారు. అనంతరం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ నిలువెత్తు బంగారం సమర్పించారు. గవర్నర్ల వెంట మంత్రులు సత్యవతిరాథోడ్, ఎర్రబెల్లి దయాకర్రావు, ఇంద్రకరణ్రెడ్డి ఉండి పూజా కార్యక్రమాలను పూర్తి చేయించారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై మాట్లాడుతూ మహిమ గల సమ్మక్క, సారలమ్మ దేవతలను దర్శించుకోవడం సంతోషం ఉందన్నారు. రాష్ట్రం సుభీక్షంగా ఉండాలని అమ్మవార్లను కోరుకున్నట్లు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ వనదేవతల జాతరకు ప్రతి ఏడు భక్తుల రద్దీ పెరుగుతోందని వారి దయతో ప్రజలు సుఖశాంతులతో ఉంటారన్నారు.