మనతెలంగాణ/మర్పల్లి: ప్రేమ పేరుతో ఓ మైనర్ బాలికను మోసగించిన సంఘటనలో వివాహితుడిపై వికారాబాద్ డిఎస్పి అద్వర్యంలో రేప్, పోక్సోచట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు ఎస్ఐ సతీష్ పేర్కొన్నారు. గురువారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మర్పల్లి మండల పరిదిలోని సిరిపురం గ్రామానికి చెందిన కావలి వీరేశం (28)కు సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలానికి చెందిన శ్రీలతతో ఆరు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. మర్పల్లి మండల పరిదిలో వీరేశం భార్య శ్రీలతకు బంధువుల కుటుంబంతో దంపతులు కలిసి మెలిసి ఉండేవారు. ఇందులో భాగంగానే వీరేశముకు మరుదలు వరుస అయిన మైనర్తో(16) పరిచయం పెంచుకున్నాడు. అనంతరం అమ్మాయికి ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పి ఆమెను పలుమార్లు లొంగదీసుకున్నాడు. అమ్మాయిని సంగారెడ్డి పట్టణంలోని ఓకేషనల్ కాలేజ్లో అడ్మిషన్ చేయించి అక్కడ సైతం వీరేశం అమ్మాయిని కలుస్తుండేవాడు. దీంతో ఇద్దరు కలిసి పారిపోయారని బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు వీరేశంపై రేప్కేసు, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
లైంగికంగా వేధించినా, అసభ్యంగా ప్రవర్తించినా సమాచారం ఇవ్వండి…
మర్పల్లి మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలపాఠశాలలో చదువుతున్న బాలికలకు కానీ, గ్రామాల్లో ఉంటున్న మహిళలకు కానీ యువకులు, మగవారు ఎవ్వరైనా వేధింపులకు గురిచేసినా, అసభ్యకరకంగా ప్రవర్తించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ సతీష్ పేర్కొన్నారు. ఇటువంటి విషయాలలో యువతులు, వారి తల్లితండ్రులు తమతో సహకరించాలని ఆయన సూచించారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల పేర్లను ఎక్కడ బయటకు చెప్పబోమని, గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు. కళాశాల, పాఠశాల ప్రారంభం, ముగింపు సమయాలలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.