ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ’యోగాంధ్ర-2025’ కార్యక్రమం సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం విశాఖపట్నం వేదికగా నిర్వహించిన ఈ బృహత్ యోగా ప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్ రికారడ్స్లో స్థానం సంపాదించింది. ఈ అపూర్వ కార్యక్రమంలో మూడు లక్షలకు పైగా ప్రజలు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు. విశాఖ నగరంలోని సుందరమైన రామకృష్ణ బీచ్ నుంచి భీమిలి వరకు విస్తరించిన సుదీర్ఘ మార్గంలో లక్షలాది మంది ప్రజలు ఏకకాలంలో వివిధ యోగాసనాలు వేశారు. క్రమశిక్షణతో, సమన్వయంతో సాగిన ఈ యోగా ప్రదర్శన చూపరులను అబ్బురపరిచింది.
ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఒకే చోట, ఒకే సమయంలో యోగా చేయడం ద్వారా గతంలో గుజరాత్లోని సూరత్లో నమోదైన రికార్డును ‘యోగాంధ్ర- 2025’ అధిగమించడం విశేషం. ఈ భారీ జనసమీకరణతో గతంలో సూరత్లో 1,47,952 మందితో నెలకొల్పిన యోగా రికార్డును విశాఖ అధిగమించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది. ఈ గిన్నిస్ రికార్డు సాధించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ కీర్తి ప్రతిష్ఠలు అంతర్జాతీయ వేదికపై మరోసారి ఇనుమడించాయి. విశాఖ సాగర తీరం ఈ చారిత్రక ఘట్టానికి సాక్ష్యంగా నిలిచింది.
కలెక్టర్ ను అభినందించిన సీఎం చంద్రబాబు : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ‘యోగాంధ్ర-2025’ కార్యక్రమం విజయవంతం కావడం పట్ల సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, విజయవంతంగా నిర్వహించడంలో కీలక భూమిక పోషించిన విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్పై ప్రశంసల వర్షం కురిపించారు. కలెక్టర్ చూపిన చొరవ, పటిష్టమైన ప్రణాళిక అమలు తీరును చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. శనివారం విశాఖలో జరిగిన ఈ బృహత్ యోగా కార్యక్రమంలో ఏకంగా 3,02,087 మంది పాల్గొన్నారని ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. ఈ సందర్భంగా ఒకేసారి రెండు గిన్నీస్ ప్రపంచ రికార్డులు నెలకొల్పడం ఇదే మొదటిసారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
యోగా వేడుకలపై ప్రధాని మోదీ ప్రశంసలు : విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు విజయవంతంగా ముగియడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల నిర్వహణలో రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ చూపిన చొరవ, కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఆయన నిరంతర పర్యవేక్షణ వల్లే కార్యక్రమాలు ఇంతటి ఘన విజయం సాధించాయని ప్రశంసించారు. ‘యోగాంధ్ర’ పేరిట చేపట్టిన కార్యక్రమాల ద్వారా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడంలో లోకేశ్ సఫలీకృతులయ్యారని ప్రధాని మోదీ ప్రశంసించారు. విశాఖలో జరిగిన యోగా దినోత్సవ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
యోగా డే ఘన విజయంపై చంద్రబాబు సమీక్ష : అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. విశాఖపట్నంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో యోగా దినోత్సవం జరిగిన తీరుపై సమావేశంలో చర్చించారు. ప్రజల సహకారం, వారి క్రియాశీల భాగస్వామ్యం, అన్ని ప్రభుత్వ విభాగాల సమన్వయంతోనే సాధ్యమైందని పేర్కొన్నారు. యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయడంలోనూ, పలు ప్రపంచ రికార్డులు సాధించడంలోనూ కీలక పాత్ర పోషించిన మంత్రులు, శాసనసభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులను చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు.