Tuesday, April 30, 2024

కత్తిపోటుపై ‘ఓటుపోటు’

- Advertisement -
- Advertisement -

దుర్మార్గ రాజకీయాలకు గుణపాఠం చెప్పాలి: కెటిఆర్

మన తెలంగాణ/దౌల్తాబాద్: కత్తిపోటు రాజకీయాలకు ఓటుపోటుతో గుణపాఠం చెప్పాలని బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుం ట్ల తారకరామారావు అన్నారు. మాయ మాటలు చెప్పే బిజెపి, కాంగ్రెస్ పార్టీలను నమ్మి ప్రజలు మోసపోవద్దని ప్రజలకు సూచించారు. దుబ్బాక ఎంఎల్‌ఎగా కొత్త ప్రభాకర్ రెడ్డికి ఘన విజయం అందించాలని కెటిఆర్ కోరారు. మంగళవారం దౌల్తాబాద్ మండల కేంద్రంలో నియోజకవర్గ స్థాయి యువ నాయకుల రోడ్ షో కార్యక్రమంలో ఎంపి, దుబ్బాక ఎంఎల్‌ఎ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డితో క లిసి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అబద్ధాలు మాట్లాడి గద్దెనెక్కిన రఘునందన్ దుబ్బాకకు పైసా పనిచేసిండా? అని ప్రశ్నించారు. పనిచేయని రఘునందన్‌ను చిత్తుగా ఓడించాలన్నారు.

ఉప ఎన్నికల్లో అమలుకాని హామీలు ఇచ్చిన రఘునందన్ చిట్టాను మరోసారి చదివి ప్రజలకు వినిపించారు. ప్రతి నిరుద్యోగులకు 3 వేల నిరుద్యోగ భృతి, రైతులకు ఉచిత ఎరువులు, ఉచిత కార్పొరేట్ ఆసుపత్రి, కూడవేల్లి జీవనది ఇది మన మే చేసినము, యువతకు ఉపాధి శిక్షణ కేంద్రం, ఉచిత శిక్షణ, దుబ్బాకకు ఔటర్ రింగ్ రోడ్డు, చే గుంట, దుబ్బాకకు డిగ్రీ కళాశాలలు, దుబ్బాకకు పరిశ్రమలు, పర్యటన కేంద్రాలు, రైతులకు కల్లాలు, ఎడ్లు, బండి ఇవన్నీ హామీలు ఏమయ్యాయన్నారు. మళ్లీ నేడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారో నిలదీయలన్నారు. పైసా పనిచెయ్యక, ప్రభాకర్‌రెడ్డి చేసిన పనులకు కొబ్బరి కాయలు కొట్టిన రఘునందన్ రావు నేడు ఊర్లు పోతాయని, రైతులు భూములు గుంజుకుంటామని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారన్నారు. ఎన్నికల్లో విజయం సాధించగానే ప్రభుత్వ భూములకు పట్టా హక్కులు, కల్పిస్తామని, అమ్ముకునే హక్కు కల్పిస్తామన్నారు. ఆగమాగమయ్యే ఎన్నికలు కావని దుబ్బాక తలరాత మార్చే ఎన్నికలుగా నిలుపుకోవాలన్నారు. 2014 కు ముందు కాంగ్రెస్ పాలన ఎలా ఉండే, కరెంటు ఎలా ఉండే, ఎవరన్నా చనిపోతే కరెంటు కోసం ఎన్నిసార్లు బతిమాలుడు ఉండేదో మనం ఇంకా మర్చిపోలేదన్నారు. చీకటి పరిపాలన చేసిన కాంగ్రెస్ మరొక్కసారి అవకాశం ఇవ్వాలని కోరడం సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్ పాలన అంటేనే కాలిపోయే మోటార్లు, ఎండిన పోయిన చెరువు కుంటలు, కరువు కాటకాలన్నారు. 24 గంటల కరెంట్ సరఫరాపై మాట్లాడే కాంగ్రెస్ నాయకులను ప్రభాకరన్న బస్సుల్లో దుబ్బాకకు తీసుకువొచ్చి, ఏ సమయంలోనైనా సరే కరెంటు వైర్లను పట్టుకోవాలని, దరిద్రం వదులుతుందన్నారు.

చావగొట్టింది కాంగ్రెస్ పార్టీ వల్లే కదా…
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రైతుబంధు దుబారా అని, భట్టి ధరణి వద్దు అంటున్నారని ధరణి కావాలా, మధ్య దళారులు కావాలా అని ఆయన ప్రశ్నించారు. దుబ్బాకలో రఘునందన్ పైసా పనిచేసిందేమిలేదు అన్నారు. తట్టెడు మట్టి పొసిండా అని కెటిఆర్ ప్రశ్నించారు. కర్ణాటక నుండి కాంగ్రెస్‌కు, గుజరాత్ నుండి బిజెపి వాళ్లకు పైసలు వస్తున్నాయని, అంగట్లో పశువులను కొన్నట్లు కొనాలని చూస్తున్నారని కెటిఆర్ విమర్శించారు. కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తే విత్తనాలు, ఎరువుల కోసం గోసపడే రోజు వస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో 1000 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. రైతుబంధు, రైతు బీమా లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామన్నారు. కొత్తగా 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు 3 వేల చొప్పున సౌభాగ్య లక్ష్మీ పథకం ద్వారా సహాయం చేస్తామన్నారు. మిగతా పింఛన్‌లను విడతల వారీగా రూ. 5 వేలు, రైతుబంధు రూ. 16వేలు, గ్యాస్ ధర రూ. 400కు తగ్గిస్తామని కెటిఆర్ తెలిపారు.

ప్రభాకరన్నను మొన్ననే కత్తి పోటు పొడిచారని చాలా అన్యాయమన్నారు. ఇలాంటి వారికి ఓటు పోటుతో పొడిచి వారిని బొంద పెట్టాలన్నారు. డిసెంబర్ కాబోయే ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ, దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ యువతరం సిఎం కేసీఆర్ వెంటే ఉందని, మీ బలంతో వచ్చే ఎన్నికల్లో దుబ్బాక గడ్డ మీద గులాబీ జెండా ఎగురవేస్తామని పేర్కొన్నారు. యువకులకు ఎంపీ ధన్యవాదాలు తెలిపారు. సేవ చేయడానికి వస్తే అంతం చేయాలని చూశారని మీ ఆశీర్వాదంతో బతికి రావడం జరిగిందని కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సిఎం కెసిఆర్, మంత్రివర్యులు తన్నీరు హరీశ్ రావు, కల్వకుంట్ల తారకరామారావు ఆశీర్వాదంతో దుబ్బాక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

రోడ్ షో కార్యక్రమంకు వేలాదిగా యువకులు తరలి రావడంతో దుబ్బాక బిఆర్‌ఎస్‌లో కొత్త జోష్ వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ ఎంపిపి సంధ్యా రవీందర్ జెడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ జడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి దౌల్తాబాద్ మండల బిజెపి పార్టీ అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్ జిల్లా కోఆప్షన్ సభ్యులు రహీముద్దీన్ మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి గౌతమ్ మండల వైస్ ఎంపీపీ మళ్లీ శేఖర్ రెడ్డి , దౌల్తాబాద్ మండలఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు బండారు దేవేందర్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు హనుమాన్ల రాజిరెడ్డి, ఇప్ప దయాకర్ వివిధ మండలాల జడ్పిటిసిలు ఎంపిపిలు, సర్పంచులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు వివిధ మండలాల చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News