Friday, April 26, 2024

వచ్చే దశాబ్ద కాలానికి ప్రణాళికలు రూపొందిస్తాం

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : స్వరాష్ట్రం సిద్ధించిన తొమ్మిదేళ్ల కాలంలోనే అభివృద్ధి సంక్షేమ రంగాల్లో యావత్ భారతదేశం గర్వించే స్థాయికి తెలంగాణ రాష్ట్రం చేరుకుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబరాల్లో భాగంగా లకారం ట్యాంక్ బండ్ పై శుక్రవారం రాత్రి తొలి రోజు వేడుకలను మంత్రి పువ్వాడ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇరుకైన, అస్థవ్యస్థంగా ఉన్న ఖమ్మం నగరాన్ని తెలంగాణ ప్రభుత్వం వచ్చాక దాదాపు 2వేల కోట్ల రూపాయల నిధులతో అన్ని వసతులు, సౌకర్యాలు కల్పించుకున్నామని, గొంగళి పురుగులా ఉన్న ఖమ్మం ను సీతాకొక చిలుకలా మార్చుకున్నామన్నారు.

ఖమ్మం నగరంలో ఒకప్పుడు కనీసం త్రాగడానికి నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డ రోజులు నాకు బాగా గుర్తున్నాయని ప్రతిరోజూ త్రాగునీటి ట్యాంకర్లు గల గల అంటూ రోడ్లపై తిరుగుతుండేవని, కానీ నేడు మిషన్ భగీరథ పథకం ద్వారా నగరంలో దాదాపు 45 వేల నల్లాల ద్వారా ఇంటింటికి స్వచ్చమైన త్రాగునీరు అందిస్తున్నామని, వాటర్ ట్యాంకర్‌ల అవసరమే లేకుండా పోయిందని పేర్కొన్నారు.మన ఖమ్మంను సొంత ఇల్లు వలే స్వచ్చంగా, సుందరంగా మలుచుకున్నమని, అది కేవలం బిఆర్‌ఎస్ ప్రభుత్వం వల్లే సాధ్యమైందని వివరించారు.

బిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్లే, ఇంత పెద్ద ఎత్తున నిధులు రావడం వల్లే మురికి కూపంలా ఉన్న ఖమ్మం.. నేడు రాష్ట్రంలోని అనేక జిల్లాలకు ఆదర్శంగా నిలిచిందని, ఇంతటి ప్రగతి కేవలం బిఆర్‌ఎస్ ప్రభుత్వం వల్లే సాధ్యమైందని, అందుకే ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ ముఖ్యమంత్రిగా కెసిఆర్ హ్యాట్రిక్ సాధించబోతున్నారని స్పష్టం చేశారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మేటిగా నిలిచిందని దేశవ్యాప్తంగా ఏ ఒక్క రాష్ట్రం కూడా తెలంగాణకు సాటి రాదని తెలిపారు. తొమ్మిదేళ్ళ రాష్ట్ర ప్రగతి ప్రస్థానాన్ని ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ వివరించారు.

ఈ సందర్బంగా ఖమ్మం నగరంలో చేపట్టిన అనేక అభివృద్ది పనులపై చిత్రీకరించిన నాడు నేడు వీడియోను మంత్రి పువ్వాడ ఆవిష్కరించారు.ఈ ట్యాంక్ బండ్ పై వివిధ శాఖల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌లను ప్రారంబించి సందర్శించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్య్రమాలు నిర్వహించారు. చిన్నారులు పలు నృత్యాలతో, కళారూపాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు, మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా కలెక్టర్ విపిగౌతమ్ అదనపు కలెక్టర్‌లు స్నేహలత మొగిలి, మధుసుధన్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, సుడా చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్ లు కమర్తపు మురళీ,బి ఆర్ ఎస్ నాయకులు పగడాల నాగరాజు, బొమ్మెర రాంమూర్తి తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News